మృత్యువుతో పోరాటం.. బతకాలని ఆరాటం

11 May, 2018 01:18 IST|Sakshi

ఉస్మానియాలో కాలేయ మార్పిడి బాధితుల గోడు

ఆపరేషన్‌ థియేటర్, ఐసీయూ లేక నిలిచిన చికిత్సలు

తాత్కాలికంగా గాంధీ ఓటీ కేటాయింపు.. అడ్డుకుంటున్న నేతలు

సాక్షి, హైదరాబాద్‌: ఇలా ఒకరు ఇద్దరు కాదు.. సుమారు 70 మంది కాలేయ సంబంధిత బాధితులు ప్రస్తుతం ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. చికిత్స చేసే వైద్య నిపుణులు ఉన్నా.. ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం జీవన్‌దాన్‌లో 5,002 మంది అవయవాల కోసం పేర్లు నమోదు చేసుకుంటే, వీరిలో 2,706 మంది కిడ్నీల కోసం, 2,197 మంది కాలేయాల కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క ఉస్మానియాలోనే 70 మంది బాధితులు కాలేయ మార్పిడి చికిత్సల కోసం ఎదురు చూస్తున్నారు. 

కోమాలో ఉస్మానియా గ్యాస్ట్రో ఎంటరాలజీ.. 
ప్రతిష్టాత్మక ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాన్ని 2010లో ఏర్పాటు చేశారు. ప్రముఖ సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ మధుసూదన్‌ నేతృత్వంలో ఇప్పటివరకు ఏడు కాలేయ(బ్రెయిన్‌డెత్‌ కేసుల నుంచి అవయవాలను సేకరించి బాధితునికి అమర్చడం) మార్పిడి చికిత్సలను విజయవంతంగా చేశారు. పైసా ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యసేవలను పొందే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాల నిరుపేద బాధితులు చికిత్సల కోసం ఇక్కడికి వస్తున్నారు. అయితే సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి ఆపరేషన్‌ థియేటర్‌ కానీ, ఐసీయూ కానీ లేదు. దీంతో వేరే విభాగానికి చెందిన థియేటర్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. రోగుల నిష్పత్తికి తగినన్ని బ్రెయిన్‌డెత్‌ కేసులు లేకపోవడంతో బాధితుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అవయవాన్ని దానం చేసేందుకు బంధువులు(లైవ్‌ డోనర్‌) ముందుకొచ్చినా.. ఆస్ప త్రిలో అవసరమైన ఆపరేషన్‌ థియేటర్, ఐసీయూ లేదు. 

ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా.. 
సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్‌ మధుసూదన్‌ చికిత్సల్లో ఎదురవుతున్న ఇబ్బందులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సహా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. లైవ్‌డోనర్‌ సర్జరీల కోసం మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్‌ సహా అత్యాధునిక ఐసీయూను ఏర్పాటు చేయాలని భావిస్తూ.. ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించింది. ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం శిథిలావస్థకు చేరడంతో కింగ్‌కోఠి ఆస్పత్రిలో వీటిని ఏర్పాటు చేయాలని భావించారు. అత్యవసర సమయంలో చికిత్సలు అందించేందుకు అవసరమైన విభాగాలు, నిపుణులు అక్కడ లేకపోవడంతో వెనుకడుగు వేశారు. ఉస్మానియాలో నూతన భవన నిర్మాణానికి మరో ఐదారేళ్లు పట్టే అవకాశం ఉండటంతో తాత్కాలికంగా సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాన్ని గాంధీకి తరలించాలని భావించింది. అక్కడికి వెళ్లి చికిత్సలు చేసేందుకు వైద్యులు సుముఖంగా ఉన్నా.. ఆయా ఆస్పత్రుల్లో వైద్యుల సంఘం నేతలుగా చలామణి అవుతున్న ఇద్దరు వ్యక్తుల వల్ల ఈ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. 

అనంతపురం జిల్లా సిండికేట్‌నగర్‌కు చెందిన దేవి ఒక్కగానొక్క కుమారుడు ధర్మతేజ(14) పుట్టుకతోనే కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. నాలుగేళ్ల క్రితం రక్తపువాంతులు కావడంతో స్థానిక వైద్యులకు చూపించారు. ఫలితం లేకపోవడంతో ఇటీవల ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు కాలేయం పనితీరు పూర్తిగా దెబ్బతిందని, కాలేయ మార్పిడి ఒక్కటే పరిష్కారమని స్పష్టం చేశారు. జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేసినా.. కాలేయం దొరకలేదు. బాబు ఆరోగ్యం క్షీణించడంతో తన కాలేయంలో కొంత భాగం ఇచ్చేందుకు తల్లి దేవి ముందుకొచ్చింది. అయితే లైవ్‌డోనర్‌ నుంచి అవయవాన్ని సేకరించి, సర్జరీ చేసే అవకాశం ఉస్మానియాలో లేకపోవడంతో వైద్యులు ఏమీ చేయలేని పరిస్థితి. 

యాదాద్రి జిల్లాకు చెందిన నర్సింహ, అరుణల కుమారుడు అద్విత్‌ కుమార్‌(12 నెలలు) పుట్టుకతోనే కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం నిలోఫర్‌కు వెళ్లగా, ఉస్మానియాకు సిఫార్సు చేశారు. పరీక్షించిన వైద్యులు కాలేయ మార్పిడి చేయాలని సూచించారు. అయితే ఆస్పత్రిలో లైవ్‌డోనర్‌ చికిత్సలు అందుబాటులో లేకపోవడంతో బాబు తల్లిదండ్రులు అయోమయంలో పడిపోయారు.

‘కార్పొరేట్‌’ సహకారంతో బాలికకు పునర్జన్మ 
నాగర్‌కర్నూలు జిల్లా చారగొండకు చెందిన శ్రీకాంత్, రాణి దంపతుల కుమార్తె సాయివర్షిత(7) పుట్టుకతోనే కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. పాప ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ‘ఆటో ఇమ్యూనో డిసీజ్‌’తో ఆమె బాధపడుతున్నట్లు గుర్తించి.. వెంటనే కాలేయ మార్పిడి చేయాలన్నారు. తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసేందుకు తల్లి రాణి ముందుకొచ్చింది. ఆస్పత్రిలో లైవ్‌డోనర్‌ చికిత్సకు అవకాశం లేకపోవడంతో ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించి దాతల సహాయంతో చికిత్స చేశారు.

అనంతపురం జిల్లా సిండికేట్‌నగర్‌కు చెందిన దేవి ఒక్కగానొక్క కుమారుడు ధర్మతేజ(14) పుట్టుకతోనే కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. నాలుగేళ్ల క్రితం రక్తపువాంతులు కావడంతో స్థానిక వైద్యులకు చూపించారు. ఫలితం లేకపోవడంతో ఇటీవల ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు కాలేయం పనితీరు పూర్తిగా దెబ్బతిందని, కాలేయ మార్పిడి ఒక్కటే పరిష్కారమని స్పష్టం చేశారు. జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేసినా.. కాలేయం దొరకలేదు. బాబు ఆరోగ్యం క్షీణించడంతో తన కాలేయంలో కొంత భాగం ఇచ్చేందుకు తల్లి దేవి ముందుకొచ్చింది. అయితే లైవ్‌డోనర్‌ నుంచి అవయవాన్ని సేకరించి, సర్జరీ చేసే అవకాశం ఉస్మానియాలో లేకపోవడంతో వైద్యులు ఏమీ చేయలేని పరిస్థితి. 

యాదాద్రి జిల్లాకు చెందిన నర్సింహ, అరుణల కుమారుడు అద్విత్‌ కుమార్‌(12 నెలలు) పుట్టుకతోనే కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం నిలోఫర్‌కు వెళ్లగా, ఉస్మానియాకు సిఫార్సు చేశారు. పరీక్షించిన వైద్యులు కాలేయ మార్పిడి చేయాలని సూచించారు. అయితే ఆస్పత్రిలో లైవ్‌డోనర్‌ చికిత్సలు అందుబాటులో లేకపోవడంతో బాబు తల్లిదండ్రులు అయోమయంలో పడిపోయారు. 

మరిన్ని వార్తలు