ఏటీఎంకు తాళం వేసి కీ మరిచారు..

29 Jul, 2018 02:31 IST|Sakshi

హైదరాబాద్‌: బ్యాంకు ఆవరణలోని ఏటీఎంలో డబ్బులు భద్రపరిచిన బ్యాంకు అధికారులు మిషన్‌కు తాళం వేసి.. కీని మాత్రం మరిచిపోయారు. తార్నాక విజయపురిలోని ఎస్‌బీఐ లాలాగూడ బ్రాంచ్‌లో 2 ఏటీఎం మిషన్లతో పాటు ఒక మనీ డిపాజిట్‌ మిషన్‌ను గతంలో ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి బ్యాంకు అధికారులు ఏటీఎం మిషన్లలో డబ్బులు భద్రపరిచేందుకు తాళాలు తీశారు.

డబ్బులు మిషన్లలో పెట్టిన తర్వాత మిషన్‌కు తాళం వేసి.. కీని మాత్రం అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. డబ్బు లు డ్రా చేసేందుకు వెళ్లిన స్థానికులు ఏటీఎంకు తాళం కీ అలాగే ఉండటాన్ని గమనించి పోలీసు లకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీçసులు తాళం కీని స్వాధీనం చేసుకున్నారు. శనివారం సెలవు కావడం, బ్యాంకు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో అధికారులను రప్పించేందుకు పోలీసులు తంటాలు పడాల్సి వచ్చింది. ఎట్టకేలకు అర్ధరాత్రి తర్వాత బ్యాంకు అధికారులు వచ్చి కీని స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు