ప్రాణాలు నిలిపిన కరోనా లాక్‌డౌన్‌!

27 May, 2020 15:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నియంత్రణకు విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ వందలాది ప్రాణాలను నిలిపింది. లేదంటే భానుడి భగభగలతో నిప్పుల కుంపటిలా మారిన భారత్‌లో వందలాది మంది పిట్టల్లా రాలిపోయేవారు. దేశవ్యాప్తంగా వడగాడ్పులు, ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. అనేకచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లాక్‌డౌన్‌ 4.o లో సడలింపులు ఇచ్చినప్పటికీ అధికశాతం జనం ఇళ్లకే పరిమితమయ్యారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో బుధవారం ఎండలు మండిపోయాయి. ఢిల్లీలో 45, హైదరాబాద్‌ 42, అహ్మదాబాద్‌ 43, పుణె 37, చెన్నై 37, ముంబూ 34, బెంగుళూరు 32, కోల్‌కత 32 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. ఉత్తర భారత్‌లోని అనేక అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఇక తెలంగాణలోని ఆదిలాబాద్‌ 46, బోధన్‌, 45, జగిత్యాల 46, కొత్తగూడెం 42, మహబూబ్‌నగర్‌ 43, మంచిర్యాల 44, నిజామాబాద్‌ 45, కామారెడ్డి 44, కరీంనగర్‌ 44, మిర్యాలగూడ 46, నిర్మల్‌ 45, పాల్వంచ 42, వరంగల్‌ 43 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  దీంతో ఆయా ప్రాంతాల్లో వడగాడ్పులు వీచడంతో జనం విలవిల్లాడిపోయారు. అధిక ఎండలు, వడగాల్పులకు జాగ్రత్తలు తీసుకోకుంటే తీవ్ర అనారోగ్యాల బారిన పడే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇదిలాఉండగా.. బుధవారం దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రం దాన్ని ఆనుకుని ఉన్న బంగాళాఖాతం మధ్య ఉన్న మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశముందని వాతావరణ విభాగం అధికారులు చెప్తున్నారు.

మరిన్ని వార్తలు