శరవేగంగా లాజిస్టిక్‌ పార్కు

13 Apr, 2018 10:46 IST|Sakshi
లాజిస్టిక్‌ పార్కు వద్ద కొనసాగుతున్న నిర్మాణ పనులు

మంగళ్‌పల్లి వద్ద రూ.20 కోట్లతోసాగుతున్న పనులు

నిర్మాణ దశలో గోదాం,కార్యాలయం  

వచ్చే ఏడాదికి పూర్తిచేస్తామంటున్న

ఆన్‌కాన్‌ ప్రతినిధులురాష్ట్రంలో

అతిపెద్ద లాజిస్టిక్‌ పార్కు ఇదే..

ఇబ్రహీంపట్నంరూరల్‌: సుదూర ప్రాంతాల నుంచి సరుకులతో నగరానికి వచ్చే లారీలు, ట్రక్కులతో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడుతున్నందున ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. నగర శివారులో రెండు లాజిస్టిక్‌ పార్కుల నిర్మాణం చేపట్టింది. సరుకులను అక్కడ దింపి చిన్న వాహనాల ద్వారా నగరంలోని రవాణా చేస్తారు. గత సంవత్సరం అక్టోబర్‌ 6న ఇబ్రహీంపట్నం నియోజవర్గంలో మంగళ్‌పల్లి, బాటసింగారం గ్రామాల్లో లాజిస్టిక్‌ పార్కులఏర్పాటుకు మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డిలు పునాది రాయి వేశారు. హైదరాబాద్‌ నగరంలోకి భారీ వాహనాల రాకపోకలపై నిషేధం ఉండటంతో సరుకుల రవాణాకు ఇబ్బందులు కలగకుండా ఈ లాజిస్టిక్‌ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భారీ వాహనాలు లాజిస్టిక్‌ పార్కుల వద్దకు వచ్చి అక్కడ సరుకులు దింపుతాయి. అక్కడి నుంచి నగరంలోకి చిన్న వాహనాల ద్వారా సరుకులు రవాణా అవుతాయి. అంతేకాకుండా సుదీర్ఘ ప్రయాణం చేసిన వాహనాల డ్రైవర్లు సేదతీరడానికి లాజిస్టిక్‌ పార్కుల్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. 

రూ.20 కోట్లతో 22 ఎకరాల్లో నిర్మాణం  
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మంగళ్‌పల్లి సర్వే నెంబరు 127లో 22 ఎకరాల భూమిలో రూ.20 కోట్లతో లాజిస్టిక్‌ పార్కు నిర్మాణం చేస్తున్నారు. ప్రస్తుతం పాలనా పరమైన భవనం, పెద్ద గోదాం నిర్మాణం చేపడుతున్నారు. బొంగ్లూర్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డుకు అనుసంధానం చేస్తూ రోడ్డును వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి లాజిస్టిక్‌ పార్కుగా మంగళ్‌పల్లిలో ఏర్పాటు కాబోతున్న లాజిస్టక్‌ పార్కు పేరుపొందనుంది. అన్‌కాన్‌ సంస్థ  పనులు శరవేగంగా చేస్తోంది. ఇక్కడ 250 ట్రాక్కులు ఒకే సారి వచ్చి నిలపడానికి వీలుంటుంది. డ్రైవర్లు సేదతీరడానికి గెస్ట్‌హౌజ్‌లు నిర్మిస్తారు. వచ్చే ఏడాది లోపు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి అన్‌కాన్‌ సంస్థ ప్రతినిధులు కసరత్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు