ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు

31 May, 2014 23:49 IST|Sakshi

హత్నూర, న్యూస్‌లైన్ : రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో కండక్టర్, డ్రైవర్‌తో సహ ఎనిమిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని నస్తీపూర్ శివారులో సంగారెడ్డి, నర్సాపూర్ ప్రధాన రహదారిపై శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ ప్రమాద్‌కుమార్ కథనం మేరకు.. సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నర్సాపూర్ నుంచి సంగారెడ్డి వస్తోంది.

అయితే మండలంలోని నస్తీపూర్ గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆర్టీసీ బస్సు డ్రైవర్ చెడిపోయి రోడ్డు పక్కన ఆపి ఉంచిన లారీని ఢీకొన్నాడు. ఈ సంఘటనలో బస్సు డ్రైవర్ రాజునాయక్, కండక్టర్ జానమ్మతో పాటు ప్రయాణికులు కౌడిపల్లి మండలం వెంకట్రావ్‌పేట్ గ్రామానికి చెందిన డప్పు జగన్, అతడి భార్య పోచమ్మ, హత్నూర మండలం కిసింద్లాపూర్ గ్రామానికి చెందిన రుక్కమ్మ, నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తి గ్రామానికి చెందిన కుర్మ నారాయణ, శివ్వంపేట మండలంకు చెందిన అల్లీపూర్ అశోక్, చిక్‌మద్దుర్ గ్రామానికి చెందిన జగ్గంపేట నవీన్‌లు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ ప్రమోద్‌కుమార్ తెలిపారు. బస్సు ప్రమాదంలో గాయపడి నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీమంత్రి సునీతారెడ్డి శనివారం సాయంత్రం పరామర్శించారు.
 

మరిన్ని వార్తలు