విషమ పరీక్ష!

29 Apr, 2015 00:09 IST|Sakshi

జ్వరం... జలుబు చేసినా తప్పని వైద్య పరీక్షలు

- అడ్డగోలుగా వెలిసిన డయాగ్నోస్టిక్ సెంటర్లు
- ఇష్టారీతిగా వసూళ్లు.. జేబులకు చిల్లు
- ప్రమాణాలకు చెల్లుచీటి
- రోగం ఒకటైతే... రిపోర్టులో మరోటి
- నియంత్రణ కోల్పోయిన జిల్లా వైద్య శాఖ
- తనిఖీలు మృగ్యం

రోగులు, బాధితులకు రోగ నిర్ధారణ కేంద్రాలు చుక్కలు చూపిస్తున్నాయి. జిల్లాలోని చాలాచోట్ల అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి.. నివేదికలు కూడా అడ్డదిడ్డంగానే ఇస్తున్నాయి.. రోగ నిర్ధారణ నివేదికలుంటే గానీ వైద్యులు నాడీ పట్టక పోవడంతో ఈ కేంద్రాల నిర్వాహకుల పంట పం డుతోంది... సాధారణ జ్వరమొచ్చినా వైద్యులు పరీక్షలకు సిఫారసు చేస్తున్నారు... దీన్ని సాకుగా తీసుకొని ఆయా కేంద్రాల వారు అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. ఈ కేంద్రాల్లో కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదు. వైద్య శాఖ అధికారులకు మామూళ్లు ముట్టజెబుతూ తనిఖీలకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మొత్తమ్మీద రోగులతో ఆడుకుంటున్నారు.

సంగారెడ్డి క్రైం: రోగమొచ్చినా.. నొప్పి వచ్చినా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాలంటే సామాన్యులు జడుసుకుంటున్నారు. మామూలు జ్వరమొచ్చినా.. జలుబు వచ్చినా పరీక్షలు రాస్తున్నారు. ఆ టెస్టులకు ఎంత మొత్తం ఖర్చవుతుందోనని బెంబేలు. అదీగాక ఏ పరీక్ష ఎటు మలుపు తిప్పుతారోనని భయం. రోగ నిర్ధారణ (డయాగ్నోస్టిక్) పరీక్ష నివేదిక లేనిదే వైద్యుడు నాడీ పట్టడం లేదు. ఫలితంగా డయాగ్నోస్టిక్ సెంటర్లు మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్న చందంగా నడుస్తున్నాయి. జిల్లాలోని ప్రతి ప్రైవేట్ ఆసుపత్రికి అనుబంధంగా ఓ డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నారు.

అక్కడి డాక్టర్ సూచన మేరకు సదరు డయాగ్నోస్టిక్ సెంటర్‌లోనే పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అక్కడి కేంద్రంలో పరీక్షకు వసూలు చేసే రుసుంలో కొంత కమీషన్ సదరు డాక్టర్లకు ఉంటుందన్నమాట. ఇంకేముంది నాడి పట్టుకోవడానికి ముందే అన్ని పరీక్షలు చేయాల్సిందేనని డాక్టర్లు చెప్పడం సర్వసాధారణ విషయంగా మారింది. దీంతో డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులు వారి ఇష్టానుసారంగా పరీక్ష ఫీజులు వసూలు చేస్తున్నారు. అంతేగాక రోగం ఒకటుంటే మరో రోగం ఉన్నట్టు చూపుతున్నారు. ఉన్న రోగం లేనట్లు... లేని రోగం ఉన్నట్టు  రిపోర్టుల్లో చూపించి డబ్బులు దండుకుంటున్నారు.

డయాగ్నోస్టిక్ సెంటర్‌లో నిష్ణాతులైన ల్యాబ్ టెక్నీషియన్లు ఉండాలి. కానీ అర్హత లేనివారు సైతం టెసు ్టలు చేస్తున్నారు. టెన్త్, ఇంటర్ చదివిన వారే అందులో పనిచేస్తున్నారు. ఫలితంగా బాధితుడికి ఉన్న సమస్య ఏమిటో నివేదికల్లో తెలియక పోవడంతో ఒక్కోసారి వైద్యులు సైతం చేతులెత్తేస్తున్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా వచ్చిన రిపోర్టునే ప్రామాణికంగా డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తుండటంతో కొన్ని సందర్భాల్లో రోగి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. జిల్లాలోని కొ న్ని కేంద్రాల్లో  వైద్య నిర్ధారణ పరీక్షల కోసం సరైన యం త్ర సామగ్రి కూడా లేదు. మొత్తమ్మీద జ్వరం వచ్చిన రోగి కి ఆసుపత్రికి వెళ్లేలోగానే జేబులకు చిల్లు పడుతుంది.

తాజాగా వెలుగు చూసిన ఘటన..
ఇటీవల సంగారెడ్డి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి జ్వరం వస్తే పట్టణంలోని ఓ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో రక్త పరీక్షలు చేయించాడు. ఆ రిపోర్టులో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా చూపించడంతోపాటు ఇతర పరీక్షలు కూడా ఇష్టం వచ్చినట్టుగా చూపించారు. మూడు రోజుల వ్యవధిలోనే హైదరాబాద్‌లోని మరో కేంద్రంలో రక్త పరీక్షలు చేయించగా మరో తీరుగా వచ్చింది.

నిద్రావస్థలో వైద్య ఆరోగ్య శాఖ...
జిల్లాలోని పలు డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు అనుబంధంగా వీటిని ఏర్పాటు చేశారు. ప్రమాణాలను పాటించకుండానే కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు వీటిని తనిఖీ చేయాల్సిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిద్రావస్థను వీడడం లేదు.

ఈ కేంద్రాల నుంచి ప్రతి నెలా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మామూళ్లు అందుతుండటం వేల్ల వాటి జోలికి వెళ్లడం లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో సదరు కేంద్రాల నిర్వాహకులు ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తూ తాము ఇచ్చిన రిపోర్టే సక్రమమని దబాయిస్తున్నారు కూడా. సామాన్యుడిని రక్షించేందుకు ఏర్పాటు చేసిన చట్టాన్ని కొందరు అధికారులు తుంగలో తొక్కుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు