కూల్చివేతపై లంచ్‌మోషన్‌ పిటిషన్‌ 

9 Jul, 2020 06:17 IST|Sakshi

విచారణ వాయిదా వేసిన హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పాలనా కేంద్రం.. సచివాలయ భవనాల్ని కూల్చకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణ చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం ఎదుట పిటిషనర్‌ న్యాయవాది ప్రభాకర్‌ కోరారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కూల్చివేత పనుల్ని వాయిదా వేయాలన్నారు. కూల్చివేత వల్ల సచివాలయ పరిసర ప్రాంతాల్లోని 5 లక్షల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాలుష్య సమస్య తలెత్తుతోందని పేర్కొన్నారు.

కూల్చివేత ఏకపక్షంగా, కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పారు. దీనిపై లంచ్‌మోషన్‌ పిటిషన్‌ అవసరం లేదని, పిటిషన్‌గా దాఖలు చేస్తే దానిని ఇతర వ్యాజ్యాల క్రమంలో విచారణ చేస్తామని ధర్మాస నం స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది. ఇదిలాఉండగా సచి వాలయ కూల్చివేతపై మంత్రివర్గం కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని, మధ్యంతర నిర్ణయం మాత్రమే తీసుకుందని ఇటీవల హైకోర్టు తీర్పులో పేర్కొన్న అంశాన్ని ప్రస్తావిస్తూ సీనియర్‌ న్యాయవాది ఎస్‌.సత్యంరెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు. మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోకుండా భవనాల కూల్చివేత నిర్ణయం చెల్లదని చెప్పారు.   

మరిన్ని వార్తలు