ఆమెదే ఆధిపత్యం

16 Apr, 2019 07:43 IST|Sakshi

మహబూబ్‌నగర్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఓటెత్తిన అతివలు

పాలమూరు: అవకాశాలను అందిపుచ్చుకుంటూ అన్నిరంగాల్లో దూసుకెళ్తున్న మహిళలు ఓటు హక్కు వినియోగించుకోవడంలో కూడా ముందు వరుసలో ఉంటున్నారు.  డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నుంచి గురువారం జరిగిన లోక్‌సభ ఎన్నికల వరకు మహబూబ్‌నగర్‌ లోక్‌సభ పరిధిలో పురుషుల కంటే అధికంగా ఓటేసి తమ బాధ్యతను నెరవేర్చుకున్నారు.

నాలుగు సెగ్మెంట్లలో.. 
మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లు ఉన్నాయి. నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో పురుషుల కంటే అధిక సంఖ్యలో మహిళలు ఓటేశారు. పార్లమెంట్‌ పరిధిలో 15,05,190 మంది ఓటర్లు ఉండగా వీటి లో 9,82,890 మంది ఓటు వినియోగించుకున్నారు. అందులో మహిళలు 4,89,453, పురుషులు 4,93,435 మంది ఉన్నారు. మొత్తంగా చూస్తే మహిళలు పురుషుల కంటే కేవలం 3,982 ఓట్లు మాత్రం తగ్గాయి. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే నాలుగింటిలో వారే ముందంజలో ఉన్నారు.

దీంట్లో కొడంగల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో 64,158 మంది పురుషులు ఓటు వేయగా, 67,454మంది మహిళలు ఓటువేశారు. అదేవిధంగా నారాయణపేట నియోజకవర్గంలో 63,702మంది పురుషులు ఓటు వేయగా, 65,680మంది మహిళలు ఓటు వేశారు. దేవరకద్ర నియోజకవర్గంలో 71, 572మంది పురుషులు ఓటు వేయగా, మహిళలు 71728 మంది ఓటు వేశారు. మక్తల్‌ నియోజకవర్గంలో 69,910మంది పురుషులు ఓటు వేయగా 71,608మంది మహిళలు తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు