ఎంజీఎం ఆస్పత్రి సమస్యలతో..

22 Nov, 2014 02:56 IST|Sakshi

ఎంజీఎం : ఉత్తర తెలంగాణకు తలమానికంగా నిలుస్తున్న వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రి సమస్యలతో సతమతమవుతోంది. ఏళ్లకేళ్లుగా తిష్టవేసిన కాంట్రాక్టర్లకు అధికారులే తలొగ్గాల్సిన దుస్థితి నెలకొంది. వరంగల్‌తోపాటు కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి రోజుకు వేలాది మంది రోగులు వచ్చే పెద్దాస్పత్రిలో సెక్యూరిటీ, శానిటేషన్ విభాగాలది కీలక పాత్ర. ప్రధాన గేట్లు, వార్డుల వద్ద రోగులతోపాటు వారి వెంట వచ్చే బంధువులను నియంత్రించాల్సిన బాధ్యత సెక్యూరిటీ సిబ్బందిపై ఉంది. అదేవిధంగా.. ఎప్పటికప్పుడు పరిశుభ్రత చర్యలు చేపట్టడంలో శానిటేషన్ విభాగానిదీ పెద్ద పాత్రే. అలాంటి ప్రధానమైన రెండు విభాగాలు సమస్యలకు నిలయంగా మారారు.

నిబంధనల ప్రకారం టెండర్లు నిర్వహించలేని పరిస్థితులు తలెత్తగా.. ఏజెన్సీ కాంట్రాక్టర్లదే హవా నడుస్తోంది. పలువురు అధికారుల నిర్లక్ష్యం.. మామూళ్ల జబ్బు ఏజెన్సీలకు వరాలు కురిపిస్తున్నారుు. రోగులకు అత్యవసర సమయూల్లో వైద్య పరికరాలు అమర్చే ‘ఇంప్లాంట్స్’ టెండర్లలోనూ ఇదే దుస్థితి నెలకొంది. టెండర్ల ప్రక్రియ వివాదంగా మారడంపై ఆస్పత్రి వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. అవినీతి అధికారులు కొందరు ధనదాహంతో తప్పులు చేసి.. కాంట్రాక్టర్లు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకునేలా వారికి పరోక్షంగా మేలు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. కొందరు ఉద్యోగులు ఏకంగా బినామీ కాంట్రాక్టర్ల అవతారం ఎత్తడంతో ఎంజీఎం ఆస్పత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిలో సాగుతున్న పలు పనులు నాసిరకంగా మారాయి.

కాంట్రాక్టర్‌కు ఆరేళ్లుగా సెక్యూరిటీ..
ఎంజీఎంలోని సెక్యూరిటీ విభాగం జైహింద్ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. ఆస్పత్రిలో సుమారు పదేళ్లుగా సదరు కాంట్రాక్టర్ తిష్టవేశాడు. ఆరేళ్లుగా టెండర్ లేకుండానే కోర్టు వివాదాలతో నెట్టుకుంటూ వస్తున్నాడు. టెండర్ల విషయంలో అధికారుల చేసిన తప్పిదాలను ఎత్తిచూపుతూ.. కోర్టుకు వెళ్తూ స్టే తెచ్చుకోవడం సెక్యూరిటీ కాంట్రాక్టర్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఈ విధంగా ఆస్పత్రిలోని అధికారులను శాసిస్తూ యథేచ్ఛగా టెండర్‌ను కొనసాగిస్తూ వస్తున్నాడు. అంతేకాదు.. ఎంజీఎం సెక్యూరిటీ విభాగ పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వ అధికారులకు అప్పగించాలి. కానీ.. ఏడాదిగా సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ను నియమించకపోవడంతో సదరు కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు.
 
వేతనాలివ్వకుండా..
ఎంజీఎంలో మూడు విడతల్లో సుమారు 105 మంది సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వర్తించాలి. వీరందరికి ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌తో కలుపుకుని ఒక్కొక్కరికి రూ.7 వేల వేతనాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తోంది. కాంట్రాక్టర్ మాత్రం ఒక్కొక్కరికి రూ.4 వేలకు మించకుండా వేతనాలిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో బడ్జెట్ రావడం లేదంటూ ఒక్కో సెక్యూరిటీ గార్డుకు సుమారుగా 8 నెలల వేతనం చెల్లించలేదు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది.. అటెండెంట్ల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఫలితంగా రోగుల వెంట వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు.. ఎంజీఎం రికార్డుల్లో 105 మంది సెక్యూరిటీ సిబ్బందిని చూపిస్తున్నా... వాస్తవంగా  60 మంది సిబ్బందితో పనిచేయిస్తున్నట్లు సమాచారం. మిగిలిన వారికి సంబంధించిన వేతనాన్ని దర్జాగా దండుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై లేబర్ అధికారులకు ఫిర్యాదు అందినా.. సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకునేందుకు వారు జంకుతున్నట్లు తెలిసింది.

శానిటేషన్‌లో తప్పని తిప్పలు
బోధన ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్ టెండర్లను ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణరుుంచడం పారిశుద్ధ్య కార్మికులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. సెక్యూరిటీ, శానిటేషన్‌ను ఒకే కాంట్రాక్టర్‌కు ఎలా అప్పగిస్తారని సెక్యూరిటీ కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లడంతో స్టే వచ్చింది. శానిటేషన్ టెండర్ కొలిక్కిరాకపోవడంతో ఎంజీఎం సూపరింటెండెంట్ పర్యవేక్షణ లో విభాగం కొనసాగుతోంది. అరుుతే.. మెడికల్ విభాగంలో శానిటేషన్ కార్మికుల వేతనాలకు సంబంధించి చిక్కులు వచ్చారుు. పెరిగిన జీతాలకు తగ్గట్టుగా ప్రభుత్వం నుంచి బడ్జెట్‌కు రాకపోవడంతో వారు ఆందోళన బాట పట్టారు. దీంతో పరిపాలనాధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్మికుల ఆందోళనతో చివరకు వారు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో చర్చలు జరిపి, పెంచిన వేతనాలు ఇస్తామనే హామీ ఇవ్వాల్సిన దుస్థితి నెలకొంది.

‘ఇంప్లాంట్స్’ కొలిక్కి వచ్చేనా?
ఎంజీఎం ఆస్పత్రిలో ఇంప్లాంట్స్ టెండర్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా వివాదంగా మారాయి. 4 నెలల క్రితం ఎంజీఎం అధికారులు ఇంప్లాంట్స్‌కు టెండర్లు పిలిచారు. ఇద్దరు కాంట్రాక్టర్లు మాత్రమే టెండర్లలో పాల్గొన్నారు. ఇందులో కొన్నేళ్లుగా ఆస్పత్రిలో కొనసాగుతున్న కాంట్రాక్టర్‌తోపాటు కొత్తగా మరో కాంట్రాక్టర్ టెండర్ దాఖలు చేశారు. పాత కాంట్రాక్టర్ కంటే టెండర్లలో పాల్గొన్న కొత్త కాంట్రాక్టర్ తక్కువ రేటుకు కోట్ చేశారు. నిబంధనల ప్రకారం ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ టెండర్లు దాఖలైనప్పుడే వీటిని తెరుస్తామని అధికారులు వాయిదా వేశారు. చివరకు జాయింట్ కలెక్టర్ అనుమతితో వీటిని తెరిచారు. ఎక్కువ రేట్ కోడింగ్ చేసిన కాంట్రాక్టర్‌కు 316 ఎల్‌వీఎం సర్టిఫికెట్ ఉందని పేర్కొంటూ.. కొన్నేళ్లుగా తిష్టవేసిన కాంట్రాక్టర్‌కు టెండర్ కట్టబెట్టేలా పలువురు అధికారులు పావులు కదిపారు.

చివరకు ఆ కాంట్రాక్టర్‌కు 316 ఎల్‌వీఎం సర్టిఫికెట్ లేదని తేలింది. ఈ టెండర్ల ప్రక్రియ వివాదంగా మారి కలకలం రేగడంతో ఎంజీఎం సూపరింటెండెంట్ మొత్తానికే వాటిని రద్దు చేశారు. త్వరలోనే పారదర్శకంగా ఈ-ప్రొక్యూర్‌మెంట్ టెండర్లు పిలుస్తామని హామీ ఇచ్చారు. కానీ.. 50 రోజులుగా పాత కాంట్రాక్టరుతోనే ఇంప్లాంట్స్ పరికరాలను ఆస్పత్రికి సరఫరా చేయించుకుంటున్నారు.

మరిన్ని వార్తలు