సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖ పూర్తి స్థాయి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా ఎం.మహేందర్ రెడ్డిని నియమిస్తూ సీఎం కేసీఆర్ సోమవారం ఫైలుపై సంతకం చేశారు. డీజీపీని నియమించుకునే అధికారాన్ని రాష్ట్రానికే కల్పిస్తూ ఇటీవల ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.
ఈ చట్టం ప్రకారమే ప్రభుత్వం మహేందర్ రెడ్డిని డీజీపీగా నియమించింది. మహేందర్ రెడ్డి గతేడాది నవంబర్ 12 నుంచి ఇన్చార్జి డీజీపీగా కొనసాగుతున్నారు. గతంలో డీజీపీల నియామకానికి యూపీఎస్సీకి ప్రతిపాదనలు పంపి, అక్కడినుంచి వచ్చిన ముగ్గురు అధికారుల పేర్లలో ఒకరిని డీజీపీగా నియమించుకునే విచక్షణాధికారం ముఖ్యమంత్రికి ఉండేది. తాజా చట్టంతో నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే డీజీపీని నియమించుకునేలా వెసులుబాటు లభించింది.