ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి వద్దంటున్నాడు..

27 Dec, 2014 01:16 IST|Sakshi
ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి వద్దంటున్నాడు..

న్యాయం చేయాలంటూ ఆందోళన

కమ్మర్‌పల్లి : ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి తనను కాదంటున్నాడని మమత అనే యువతి ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం రాత్రి పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగింది. వివరాలిలా ఉన్నాయి. కోనాసముందర్‌కు చెందిన మమత అదే గ్రామానికి చెందిన పరమేశ్వర్ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈనెల 18వ తేదీన హైదరాబాద్‌లోని ఓ ఆలయంలో స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

పరమేశ్వర్ మేనమామ వీరిని 22న కమ్మర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. తర్వాత అడవి మామిడిపల్లికి తీసుకెళ్లి, మరుసటి ఉదయం మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. అప్పటి నుంచి పరమేశ్వర్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని, తానంటే ఇష్టం లేదని పేర్కొంటున్నాడని మమత ఆరోపించింది.

ఈ విషయమై పోలీసులు తమకు కౌన్సెలింగ్ నిర్వహించారని, అయినప్పటికీ పరమేశ్వర్ తనతో కలిసి ఉండడానికి అంగీకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త బంధువైన ఓ కానిస్టేబుల్.. ఆయన మనసు మార్చి తనకు దూరం చేశారని ఆరోపించింది. ఆయనకు వేరొకరితో వివాహం జరిపించడానికి యత్నిస్తున్నారని పేర్కొంది. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. అయితే మమత తన భర్తపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఎస్సై ప్రభాకర్ తెలిపారు.

>
మరిన్ని వార్తలు