మంత్రి కేటీఆర్
ఘనంగా కైరాలీ పీపుల్ ఇన్నోటెక్ అవార్డుల ప్రదానోత్సవం
సాక్షి,సిటీబ్యూరో: అభివృద్ధిలో కేరళతో తెలంగాణ పోటీపడుతుందని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. బుధవారం రవీంద్రభారతిలో కైరాలీ పీపుల్ ఇన్నోటెక్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తాను పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేరళలోని పంచాయితీ రాజ్ పనితీరును ఆదర్శంగా తీసుకుని పనిచేశానన్నారు. ఇటీవల కస్తూరి రంగన్ నిర్వహణలో ఉన్న సంస్థ 30 రంగాలకు సంబంధించిన అంశాల్లో జరిపిన సర్వేలో కేరళ మొదాటిస్థానంలో నిలవగా మూడో స్థానం తెలంగాణకు వచ్చిందని గుర్తు చేశారు. అభివృద్ధిలో కేరళ ప్రభుత్వంతో పోటీ పడతామని తెలిపారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి అక్కడి ప్రజలు పాలక ప్రభుత్వాలను మారుస్తుంటారన్నారు. కానీ అభివృద్ధి మాత్రం ఎప్పుడూ ఒకే లాగా ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో కూడా కేరళతో కలిసి పని చేస్తామన్నారు. సినీ నటుడు, కైరాలీ చైర్మన్ భారత్ మమ్ముట్టి మాట్లాడుతూ.. భాష కాదు మానవత్వమే అందరినీ కలుపుతుందన్నారు.ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన ఐదుగురికి ఇన్నోటెక్ అవార్డ్స్ పంపిణీ చేశారు.
కార్యక్రమానికి సహకరించిన నందుకుగాను భారతీ సిమెంట్ మార్కెటింగ్ ఉపాధ్యక్షులు సురేష్ కుమార్ కైరాలీ పీపుల్స్ ఇన్నోటెక్అవార్డును అందుకొన్నారు. కైరాలీ న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ డైరెక్టర్ ఎన్ పీ చంద్రశేఖరన్,కైరాలీ ఎండీ జాన్ బ్రిట్టాస్, ఎన్ఎండీసీ సీఎండీ బైజేంద్రకుమార్, టెక్నోపార్క్ అండ్ జూరీ ఫౌండర్ సీఈవో జి. విజయ రాఘవన్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీటీఆర్ఎంఏ అధ్యక్షుడు లిబ్బి బెంజమిన్ తదితరులు పాల్గొన్నారు.
‘యాత్ర’ స్టోరీ బాగా నచ్చింది.
వైఎస్సార్ పాదయాత్ర గురించి తీసే సినిమా ‘యాత్ర’లో మంచి స్టోరీ ఉండటంతో అందులో నటించేందుకు ఒప్పుకున్నట్లు మమ్ముట్టి తెలిపారు. రవీంద్రభారతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. యాత్ర సినిమా స్టోరీ తనకు బాగా నచ్చిందన్నారు. అందుకే అడిగిన వెంటనే కాదనలేక పోయానన్నారు. కేరళ ప్రభుత్వ పనితీరు బాగుందని, అన్ని ప్రభుత్వాలతో పోల్చలేమన్నారు.