గ్రీవెన్స్‌డేలో కలకలం; కిరోసిన్‌ పోసుకున్న యువకుడు 

18 Feb, 2020 10:55 IST|Sakshi
ఆత్మాహత్యాయత్నం చేసిన షేక్‌ గౌస్,అతని నుంచి వినతిపత్రం స్వీకరిస్తున్న కలెక్టర్‌

తండ్రిని బెదిరించి భూమి తీసుకున్నారని ఆరోపణ

అధికారులు పట్టించుకోవడంలేదని కలెక్టర్‌కు విన్నపం

సాక్షి, నల్లగొండ : తన తండ్రిని బెదిరించి తమకు ఉన్న ఒక ఎకరం ఐదు గుంటల వ్యవసాయ భూమిని అక్రమంగా రిజిస్టేషన్‌ చేయించుకున్నారని ఆరోపిస్తూ ఓ యువకుడు నల్లగొండ కలెక్టరేట్‌లో సోమవారం ఒంటిపై కిరోసిన్‌ పోసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడం గ్రామానికి చెందిన షేక్‌ గౌస్‌ తన సోదరి ఆఫ్రిన్‌తో కలసి కలెక్టర్‌ కార్యాలయంలో గ్రీవెన్స్‌డేకు వచ్చాడు. వివిధ ప్రాంతాల నుంచి వచి్చన వారు కలెక్టర్‌కు, ఇతర అధికారులకు అర్జీలు ఇస్తుండగానే ఉదయం 11.45 గంటల సమయంలో లోనికి వచి్చన షేక్‌ గౌస్‌ తన వెంట బాటిల్‌లో తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుంటుండగా అక్కడే ఉన్న వారు అతడి చేతిలోని బాటిల్‌ను లాక్కున్నారు.

ఈ ఘటన కార్యాలయంలో కలకలం సృష్టించడంతో కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ అతడిని పిలిచి సమస్యను అడిగి తెలుసుకున్నారు. తుమ్మడం గ్రామానికే చెందిన నజీర్‌ అనే వ్యక్తి తన తండ్రి షేక్‌ హుస్సేన్‌ హైదర్‌ను బెదిరించి తమ కుటుంబానికి చెందిన ఒక ఎకరం ఐదు గుంటల వ్యవసాయ భూమిని రిజి్రస్టేషన్‌ చేయించున్నాడని తెలిపాడు. 2018 సంవత్సరంలో ఇది జరగ్గా, అప్పటినుంచి ఆర్డీఓ, తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్యను పరిష్కరించడం లేదని వాపోయాడు. గ్రీవెన్స్‌డేలో కూడా నాలుగు నెలల నుంచి పలు సార్లు అర్జీలు ఇచ్చినా తీసుకుంటున్నారు తప్ప తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. సమస్యను పరిష్కరించి న్యాయం చేస్తానని కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ చెప్పడంతో ఆ యువకుడు వెనుదిరిగాడు.

మరిన్ని వార్తలు