కోర్టు ఆవరణలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

8 Apr, 2015 06:28 IST|Sakshi

హైదరాబాద్: కేసు విచారణ నిమిత్తం ఎర్రమంజిల్ కోర్టుకు వచ్చిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన పి.వంశీకృష్ణ (30)ను మారేడ్‌పల్లి పోలీసులు 2012లో వ్యభిచారం కేసులో అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ-1 ముద్దాయి అయిన వంశీకృష్ణ అప్పటి నుంచి కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరవుతూ ఉన్నాడు. మంగళవారం కేసు విచారణ ఉండటంతో కోర్టుకు వచ్చాడు.

బెంచ్‌లో తన కేసు విచారణ జరుగుతుండగా వంశీకృష్ణ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. నోటి నుంచి నురగలు రావడం గమనించి అక్కడి సిబ్బంది వెంటనే సోమాజిగూడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, బాధితుడి వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా సంబంధీకులకు ఫోన్ చేస్తే వారు అతనితో తమకు సంబంధంలేదని చెప్తున్నారని పోలీసులు తెలిపారు. కోర్టు సూపరింటెండెంట్ శోభాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు