సాక్షి, హైదరాబాద్: నగరంలో పరుగులు తీస్తున్న మెట్రో రైలుకు మంచి స్పందన లభిస్తోంది. రెండోరోజు గురువారం కూడా ప్రయాణికులు పెద్దసంఖ్యలో మెట్రోరైల్లో ఎక్కేందుకు ఉత్సాహం చూపారు. అయితే, అమీర్ పేట్ మెట్రో స్టేషన్లో లిక్కర్ బాటిల్ కలకలం రేపింది. లిక్కర్ బాటిల్తో వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, లిక్కర్ బాటిల్తో పోలీసులు దొరికిపోయిన సదరు వ్యక్తి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. మెట్రో స్టేషన్లో తాగునీరు అందుబాటులో లేదని, టికెట్ తీసుకున్నాక నీళ్లు అడిగితే.. బయటికి వెళ్ళి తెచ్చుకోమని మెట్రో సిబ్బంది చెప్పారని అతను తెలిపాడు. తీరా వాటర్ బాటిల్తో వస్తే పోలీసులు అనుమతిలేదంటూ.. లోపలికి రానివ్వలేదని, దీంతో కోపం వచ్చి లిక్కర్ బాటిల్ను మెట్రో స్టేషన్లోకి తీసుకొచ్చానని అతను తెలిపాడు.