వ్యాపారంలో వాటా ఇస్తానని మోసం

17 Oct, 2015 19:17 IST|Sakshi

బంజారాహిల్స్ : వ్యాపారంలో భాగస్వామ్యం కల్పిస్తానని మభ్యపెట్టి స్నేహితుడి నుంచి రూ.25 లక్షలు వసూలు చేసి మోసం చేసిన నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి నిజాంపేటకు చెందిన పొట్లూరి సునీల్ చౌదరి(34) అదే ప్రాంతంలో శ్రీ లతాస్ లేడీస్ హాస్టల్‌తోపాటు శ్రీవారి ఫుడ్‌కోర్ట్, శ్రీవారి స్క్రీన్‌ప్రింటర్స్ వ్యాపారంతో పాటు చిట్స్ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నాడు.

కాగా గచ్చిబౌలిలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు అవకాశం వచ్చిందని, ఇందుకోసం పెట్టుబడి కావాలని భాగస్వామ్యం కోసం రూ.25 లక్షలు ఇస్తే వాటా ఇస్తానంటూ తన స్నేహితుడు అమీర్‌పేట్‌కు చెందిన కీర్తికాంత్‌ను నమ్మించాడు. ప్రతిరోజూ రూ.50 వేల వరకు కౌంటర్ అవుతుందని చెప్పడంతో ఆశపడ్డ కీర్తికాంత్ నమ్మి స్నేహితుడికి రూ.25 లక్షలు ఇచ్చాడు.

అయితే ఐసీఐసీఐ బ్యాంకులో ఎలాంటి ఫుడ్‌కోర్ట్ అనుమతి రాకపోగా.. ఆ విషయం తెలిసి తన డబ్బులు తిరిగివ్వాలని అడిగితే ముఖం చాటేశాడు సునీల్ చౌదరి. అంతేకాకుండా బెదిరించడం ప్రారంభించాడు. దీంతో బాధితుడు కీర్తికాంత్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సునీల్‌చౌదరిపై ఐపీసీ 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ గోవర్ధన్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు