ప్రేమికురాలు ఇక లేదని..

31 Oct, 2017 09:25 IST|Sakshi

ఇద్దరూ ప్రేమించుకున్నారు.. కులాలు అడ్డుగోడలుగా నిలిచాయి. పెద్దలను ఎదిరించి ఒక్కటి కావలనుకున్నారు.. వయసు తారతమ్యంతో కుటుంబ పెద్దలు కేసు పెట్టగా ప్రియుడు కటకటాల పాలయ్యాడు. అది జీర్ణించుకోలేని ప్రియురాలు  ఆరు నెలల క్రితమే బలవన్మరణానికి పాల్పడింది. ఇటీవల జైలు నుంచి విడుదలైన ప్రియుడు.. ప్రియురాలు ఇక లేదని తెలుసుకుని తాను కూడా అఘాయిత్యానికి ఒడిగట్టాడు. 

సూర్యాపేట క్రైం / శాలిగౌరారం : శాలిగౌరారం మండలం మాదారం గ్రామానికి చెందిన షేక్‌ రషీద్‌ (23) ఎలక్ట్రీషియన్‌గా జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామంలో టైలరింగ్‌ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మైనర్‌తో రషీద్‌ ప్రేమించాడు. ఇద్దరి మనసులు కలవడంతో ఒక్కటిగా కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. అదే వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఇద్దరూ కలిసి వేరే ప్రాంతానికి వెళ్లి జీవనం సాగించాలని నిర్ణయించుకుని ఇంటి నుంచి వెళ్లిపోయారు. 

కిడ్నాప్‌ కేసు పెట్టడంతో..
రషీద్‌ తమ కుమార్తెను కిడ్నాప్‌ చేశాడని తల్తిదండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల అనంతరం ప్రేమికుల ఆచూకీ తెలుసుకున్న ఖాకీలు రషీద్‌ను కటకటాల వెనక్కి నెట్టారు. అది జీర్ణించుకోలేక పోయిన బాలిక గత జూన్‌ 20న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. 

నీ వెంటే..నేనూ..
కిడ్నాప్‌ కేసులో జైలుకు వెళ్లిన రషీద్‌ ఇటీవల విడుదలయ్యాడు. ప్రేమికురాలు లేదనే విషయం తెలుసుకుని తీవ్ర మనస్తాపం చెందాడు. సోమవారం ఇంట్లో ఎవరికి చెప్పకుండా సూర్యాపేట జిల్లా కేంద్రానికి వచ్చి.. సద్దుల చెరువు కట్టపై పురుగుల మందు తాగాడు. అనంతరం బంధువులకు ఫోన్‌ చేసి సూర్యాపేట సద్దుల చెరువు వద్ద ఉన్నట్లు తెలిపాడు. దీంతో బంధువులు పోలీసులకు సమాచారం తెలపడంతో  ఘటన స్థలానికి చేరుకుని రషీద్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ  మృతిచెందాడు. మృతుడి సోదరుడు జహంగీర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ బాసిత్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు