సాక్షి, హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. బెంజ్ కారులో వచ్చిన ఓ యువకుడు తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన నార్సింగి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో ఉన్న అతడిని కేర్ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
ఫోర్ వీల్స్ కంపెనీ యజమాని విశాల్ జైన్ అనే వ్యక్తి నుంచి ఈ ఉదయం కారును అద్దెకు తీసుకున్నట్టు కనుగొన్నారు. అతడు చెప్పిన వివరాలు ఆధారంగా ఆత్మాహత్యాయత్నం చేసిన వ్యక్తి ఫైజల్ అహ్మద్గా గుర్తించారు. లోయర్ టాంక్బండ్లోని జలవాయువు నగర్లో ఫైజల్ నివాసం ఉంటున్నట్టు తెలిసింది. మాసబ్ట్యాంక్ ప్రాంతంలో నిర్వహిస్తున్న కన్సల్టెన్సీ వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పుల బాధతో అతడు ఆత్మహత్యాయత్నం చేసినట్టు ప్రాథమిక సమాచారం. కేవలం ఫోకస్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఔటర్ రింగ్ రోడ్పై ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇతనికి ఎలాంటి గన్ లైసెన్స్ లేదని తెలిసింది.