పెళ్లయిన నెలన్నరకే మృత్యు ఒడిలోకి...

30 Dec, 2018 06:51 IST|Sakshi
రోదిస్తున్న కుటుంబీకులు (ఇన్‌సెట్‌) ఇస్మాయెల్‌ (ఫైల్‌)

సుజాతనగర్‌: పెళ్లింట విషాదం నిండుకుంది. పెళ్లయిన నెలన్నర రోజులకే అనారోగ్యంతో అతడు మృతిచెందాడు. సుజాతనగర్‌ మండలం సుజాతనగర్‌ గ్రామస్తులు షేక్‌ ఇబ్రహీం, ఖాదర్‌బీ దంపతుల పెద్ద కుమారుడు షేక్‌ ఇస్మాయెల్‌(26), ఎంబీఏ పట్టభద్రుడు. ఎస్‌బీఐ ఇన్సూరెన్స్‌లో ప్రైవేట్‌ ఉద్యోగిగా కొత్తగూడెంలో పనిచేస్తున్నాడు. కొత్తగూడేనికి చెందిన షేక్‌ ఇమాంసాబ్, రజియా దంపతుల కుమార్తె ఇస్మత్‌తో గత నెల (నవంబర్‌) 12న ఇస్మాయెల్‌కు వివాహమైంది.

పెళ్లికి ముందే ఇస్మాయెల్‌కు జ్వరం సోకింది. వైద్యం చేయించుకోవడంతో తగ్గింది. ఆ తర్వాత పెళ్లయింది. ఇటీవల ఒక రోజున, డ్యూటీలో ఉండగానే అతడికి కడుపు నొప్పి వచ్చింది. కళ్లు తిరిగి పడిపోయాడు. వారం రోజులుగా ఖమ్మంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి కిడ్నీలు ఫెయిలైనట్టు వైద్యులు చెప్పారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తీసుకెళ్లాలని సూచించారు. ఈ నెల 28న (శుక్రవారం) హైదరాబాద్‌ తీసుకెళుతుండగా మృతిచెందాడు. అతని భార్య, కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.

మరిన్ని వార్తలు