బతికుండగానే బయటపడేశారు!

17 Nov, 2019 06:01 IST|Sakshi

తీవ్ర అనారోగ్యంతో ఉన్న యాచకుడిని పట్టించుకోని వైద్య సిబ్బంది

చికిత్స చేయకుండా గోదావరి ఒడ్డున పడేసిన వైనం

కొన ఊపిరితో కొట్టుమిట్టాడి.. చివరకు తుదిశ్వాస

గూడెం గ్రామస్తులు ఆందోళన

దండేపల్లి (మంచిర్యాల): మానవత్వం మంటగలిసి పోయింది. వింత వ్యాధితో అనారోగ్యానికి గురైన ఓ యాచకుడికి వైద్యం అందించక బతికుండగానే బయటపడేసి చేతులు దులుపుకున్నారు. ఈ ఘటన శనివారం దండేపల్లి మండలం గూడెం గోదావరి ఒడ్డున వెలుగు చూసింది. లక్సెట్టిపేటలోని సాయిబాబా ఆలయం వద్ద వృద్ధ యాచకుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఓ వింత వ్యాధి సోకి, మెడ సమీపంలో గాయంలా తయారై అందులో పురుగులు పడ్డాయి. మూడు రోజుల క్రితం పరిస్థితి విషమించి స్పృహకోల్పోయాడు. స్థానికులు లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా, వింత వ్యాధిగా పరిగణించిన వైద్య సిబ్బంది అతన్ని ఓ ప్రైవేటు అం బులెన్స్‌లో మంచిర్యాలకు పంపినట్లు సమాచారం. వారు అతనికి చికిత్స అందించకుండా, వరంగల్‌కు రెఫర్‌ చేశారు. అయితే.. యాచకుడికి నా అనే వారు ఎవరూ లేకపోవడంతో వరంగల్‌కు తీసుకెళ్లకుండా గూడెం గోదావరి వంతెన కింద పడేసినట్లు గూడెం గ్రామస్తులు అంటున్నారు. అయితే అతని పక్కన పడి ఉన్న బెడ్‌ షీట్‌పై లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రిగా రాసి ఉంది. శనివారం మధ్యాహ్నం వరకు అతను కొన ఊపిరితో కొట్టుకున్నాడు. పరిస్థితి విషమించి శనివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాం తంలో తుదిశ్వాస వదిలాడు. దండేపల్లి ఎస్సై విజయ్‌కుమార్‌.. పంచాయతీ సిబ్బంది సహకారంతో నది ఒడ్డున శవాన్ని పూడ్చి పెట్టించారు. కాగా, ఈ ఘటనపై గ్రామస్తులు రాస్తారోకోకు దిగారు.

గోదావరి ఒడ్డున యాచకుని మృతదేహం  

మరిన్ని వార్తలు