బైక్ ఢీకొని ఒకరు మృతి
మరో ముగ్గురికి తీవ్రగాయాలు
అల్గునూర్(మానకొండూర్):తిమ్మాపూర్ మం డలం ఇందిరానగర్లో శుక్రవారం రోడ్డు ప్రమా దం జరిగింది. ఒకరు చికిత్సపొందుతూ చనిపో గా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం... మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన అనంతుల కనకాచారి(55) వృత్తిరీత్యా కరీంనగర్లో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం పనినిమిత్తం మల్లాపూర్ గ్రామానికి వచ్చాడు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో ఇందిరానగర్ స్టేజీ వద్ద నడుచుకుంటూ రోడ్డు దాటుతున్నాడు.
వేగంగా వచ్చిన బైక్ ఢీకొని తీవ్రగాయాలపాలయ్యాడు. మొదటగా అతివేగంగా వెనుక నుంచి వచ్చిన కారు బైక్ను ఢీకొనడంతో బైక్ కనకాచారిని ఢీకొంది. దీంతో ఆయన తలకు తీవ్ర గాయాలై అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. హుటాహుటిన ప్రైవేట్ వాహనంలో కరీంనగర్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయాడు. ఇదే ఘటనలో బైక్ పై వస్తున్న ముగ్గురి కి తీవ్ర గాయాలయ్యాయి. సిద్ధిపేట నుంచి కరీంనగర్కు వస్తున్న సల్మాన్, హర్షక్, అహ్మద్లు కనకాచారిని ఢీకొని రాజీవ్ రహదారి ప్రక్కన ముళ్లపొదల్లో పడ్డారు. ప్రమాదానికి కారణమైన కారుతో సహా డ్రైవర్ పరారయ్యాడు.