పెళ్లి చేసుకోమన్నందుకు విషం తాగించాడు..

5 May, 2015 20:40 IST|Sakshi

నారాయణపేట : రెండేళ్లపాటు ప్రేమిస్తున్నానంటూ వెంటతిరిగాడు... తీరా పెళ్లి ప్రస్తావన తెచ్చే సరికి విషం తాగమన్నాడు. బలవంతంగా ఆమెకు పురుగులమందు తాగించి పరారయ్యాడు. వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం పేరపళ్ల తండాకు చెందిన పేరపళ్ల గురుమూర్తి అనే యువకుడు.. అదే తండాకు చెందిన యువతితో రెండేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. వారి పొలాలు తండాకు దగ్గరలో పక్కపక్కనే ఉన్నాయి.

సదరు యువతి ఇటీవల గురుమూర్తి వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకురాగా మొహం చాటేశాడు. ఆమె ఈ విషయమై గట్టిగా నిలదీస్తుండటంతో తప్పించుకునేందుకు ఆదివారం రాత్రి పథకం ప్రకారం పొలంలోకి తీసుకెళ్లాడు. తన వెంట తెచ్చిన పురుగులమందును ఆమెకు బలవంతంగా తాగించి పరారయ్యాడు. ఆ యువతి కేకలు వేస్తూ అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాధితురాలిని సోమవారం ఉదయం నారాయణపేట ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్య చికిత్సల అనంతరం యువతి కోలుకుంది. ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసుకొని యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రంగనాయకులు మంగళవారం తెలిపారు.

మరిన్ని వార్తలు