రైలుతో సెల్ఫీ తీసుకోవాలని..

24 Jan, 2018 13:49 IST|Sakshi

ఎంఎంటీఎస్‌ ముందు సెల్ఫీ వీడియోకు యత్నం

అదే రైలు ఢీకొట్టడంతో గాయపడిన జిమ్‌ట్రైనర్‌

సాక్షి,హైదరాబాద్‌: వేగంగా వస్తున్న ఎంఎంటీఎస్‌ ముందు సెల్ఫీ వీడియో దిగడానికి ప్రయత్నించిన ఓ యువకుడు అదే రైలు ఢీ కొట్టడంతో గాయపడ్డాడు. ఈ వీడియో బుధవారం సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేసింది. వరంగల్‌ ఉర్సు కరీమాబాద్‌కి చెందిన కృష్ణమూర్తి కుమారుడు తోటం శివ(25) జిమ్‌ ట్రైనర్‌. ఇతడి సోదరుడు సతీష్‌ హైదరాబాద్‌లోని బోరబండ సమీపంలో ఉన్న పర్వత్‌నగర్‌లో నివసి స్తున్నాడు. శివ కొన్నిరోజుల క్రితం సతీష్‌ వద్దకు వచ్చాడు. టైమ్‌పాస్‌ కావట్లేదంటూ ఆదివారం బోరబండ ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ వద్దకు వచ్చాడు.

రైలు పట్టాలకు సమీపంలో నిల్చొని వెనుక నుంచి వస్తున్న ఎంఎంటీఎస్‌తో సెల్ఫీ తీసుకునేందుకు యత్నించాడు. రైల్వే హోంగార్డ్‌ వారిస్తున్నా ఎడమ చేత్తో సెల్‌ఫోన్‌ పట్టుకున్న శివ కుడిచేత్తో రైలును చూపిస్తూ ఫోజు ఇచ్చాడు. ఇంతలో ఎంఎంటీఎస్‌ డ్రైవర్‌ ఎమర్జెన్సీ బ్రేక్‌ వేశారు. వేగం తగ్గిన రైలు వచ్చి శివ కుడిచేతిని ఢీ కొట్టింది. దీంతో పట్టాల పక్కన పడిపోయిన శివ తలకు రాయి తగలడంతో గాయపడ్డాడు.  వెంటనే  స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. సోమవారం భరత్‌నగర్‌ ఆర్పీఎఫ్‌ పోలీసులు శివకు సెల్‌ఫోన్‌ అప్పగించి అతడిపై కేసు నమోదు చేశారు. కౌన్సెలింగ్‌ అనంతరం రైల్వే కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం విధించిన రూ.500 జరిమానా శివ చెల్లించాడు. ఈ సెల్ఫీ ‘సైట్‌’ను నాంపల్లి రైల్వే ఎస్పీ జి.అశోక్‌కుమార్, ఇన్‌స్పెక్టర్‌ ఆదిరెడ్డి బుధవారం సందర్శించారు.

రైలు వెడల్పు ఎక్కువ ఉండడం వల్లే?
రైళ్ల ముందు, వాటి సమీపంలో సెల్ఫీలు దిగే అలవాటు శివకు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వరంగల్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో అతడు సాధార ణ రైళ్ల ముందు సెల్ఫీలు దిగి ఉంటాడని, వాటి వెడల్పు కేవలం రెండు మీటర్లేనని, ఎంఎంటీఎస్‌ రెండున్నర మీటర్లు ఉంటుందని చెప్పారు. అందు వల్లే రైలు శివ చేతికి తగిలి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ విషయం తెలియని శివ తప్పుడు అంచనాతో ఎంఎంటీఎస్‌ వస్తుండగా సెల్ఫీ వీడియోకు ప్రయత్నించి ఉంటాడని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు