మంత్రివర్గంలో సామాజిక న్యాయమేది?

14 Sep, 2019 12:06 IST|Sakshi

మందకృష్ణ మాదిగ

సాక్షి, కాజీపేట : కేసీఆర్‌ మంత్రి వర్గంలో వెలమ, రెడ్డి వర్గాలకే తప్ప మిగతా వర్గాలకు చోటు ఇవ్వకుండా సామాజిక న్యాయాన్ని విస్మరించారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. హన్మకొండ వడ్డేపల్లిలోని విద్యుత్‌ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు సమావేశంలో మంద కృష్ణ మాట్లాడా రు. కేసీఆర్‌ తన మంత్రి వర్గంలో మాల, గౌడ, యాదవ, ముదిరాజ్, కాపు, ముస్లిం వర్గాలకు ఒక్కో సీటు కేటాయించడం ద్వారా ద్వంద్వనీతి అవలంబించారన్నారు. మాదిగ, ఉపకులాలతో పాటు క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం లేని బీసీ, ఎస్టీ, అగ్రకుల వర్గాలకు స్థానం కల్పించేలా పోరాడుతామని తెలిపారు. సెప్టెంబర్‌ 22న హన్మకొండలోని కేడీసీ గ్రౌండ్‌లో నిర్వహించే మహాదీక్షకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలకాలని కోరా రు. అనంతరం వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు రాగటి సత్యం, ఎమ్మెస్పీ జాతీయ అధికార ప్రతినిధి తీగల ప్రదీప్‌గౌడ్‌తో బీఎన్‌.రమేష్, తిప్పారపు లక్ష్మణ్, బొడ్డు దయాకర్, మంద రాజు, ఈర్ల కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
కేయూ క్యాంపస్‌: ఉన్నతవిద్యపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. మాదిగల అస్తిత్వం కోసం, సామాజిక సమస్యలపై పోరాటాలకు ఎమ్మార్పీఎస్‌ కేంద్ర బిందువుగా నిలుస్తోందని చెప్పారు. కేయూకామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల సెమినార్‌హాల్‌లో శుక్రవారం మాదిగ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన మాదిగ అధ్యాపకుల రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మంద కృష్ణ మాట్లాడుతూ యూనివర్సిటీల్లో రెగ్యులర్‌ అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయడంతో పాటు కాంట్రాక్టు, పార్ట్‌టైం లెక్చరర్లను రెగ్యులరైజ్‌ చేయాలన్నారు. ఎంటీఎఫ్‌ బాధ్యు డు డాక్టర్‌ పి.శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన సదస్సులో కేయూ అడ్మిషన్ల డైరెక్టర్‌ టి.మనోహర్, డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ వీ.రాంచంద్రం, ఎంటీఎఫ్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ వెంకట్‌మాదిగ, డాక్టర్‌ సమ్మయ్య, డాక్టర్‌ సుదర్శన్, డాక్టర్‌ ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు