ఆవకాయ పచ్చడి మరింత ప్రియం

27 Apr, 2020 13:37 IST|Sakshi

జిల్లాలో 16 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి లక్ష్యం

కాపులేక వెలవెలబోతున్న మామిడి తోటలు

జనగామ అర్బన్‌: ఆవకాయ పచ్చడి. దాని పేరు చేపితేనే అబ్బో నోరూరిపోతుంది. ఇది ఈ ఏడాది మరింత ప్రియం కానుంది. జిల్లాలో మామిడి తోటలు కాపు లేక వెలవెలబోతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని వ్యాప్తంగా 2301 మంది రైతులు 9,405 ఎకరాల్లో మామిడి తోటలు పెంచుతున్నారు. వీటిలో జనగామ రెవెన్యూ డివిజన్‌లో 3,419 ఎకరాల్లో, స్టేషన్‌ఘన్‌పూర్‌ డివిజన్‌లో 4,063 ఎకరాల్లో అదే విధంగా పాలకుర్తి డివిజన్‌లో 1,922 ఎకరాల్లో ఈ తోటలు ఉన్నాయి. ఉద్యానవన శాఖ అధికారులు అంచనా ప్రకారం 16,31 మొట్రిక్‌ టన్నుల దిగుబడిని అంచనా వేశారు. కానీ, 9 నుంచి 10వేల మెట్రిక్‌ టన్నులు వచ్చినా సంతోషమే అంటున్నారు.

జిల్లా అంతటా ఇదే పరిస్థితి
జిల్లాలోని మూడు డివిజన్‌ అంటే 12 మండలాల నుంచి ఆశించిన దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఈ సారి తోటలు అంతగా కాపు లేదు. దాదాపు అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి. సాధారణంగా మంచిగా కాసిన తోటలు ఎకరానికి నాలుగు టన్నులు దిగిబడి వస్తుంది. కానీ అది కాస్త ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే 2 నుంచి 2.5 టన్నులు కూడ వచ్చే పరిస్థితి లేదు.  ఇటీవల ఈదురుగాలుల కారణంగా దాదాపు 50 శాతం పైగా తోటలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ సారి మామిడి ధరలు ఆకాశంటనున్నాయి.

మామిడి రేటు ఇలా..
సాధారణంగా 50 గ్రాములున్న మామిడి కాయలను దాదాపు రూ.4 నుంచి రూ.6 కు విక్రయించే వారు. కానీ, ఈ సారి అదే సైజులో ఉన్న  కాయలు కూడా రూ. 8 నుండి 10 వరకు పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు.

ఆశించిన దిగబడి రాకపోవచ్చు
ఈ సారి జిల్లా వ్యాపంగా మామిడి తోటల నుండి ఆశించిన దిగుబడి రాకపోవచ్చు. చాల చోట్లు తోటలు పూత దశలో ఉన్నట్లుగా ఇప్పుడు లేవు. లక్ష్యం 16వేల మెట్రిక్‌ టన్నులు ఉంది. అయితే పది వేల మెట్రిక్‌ టన్నులపైగా తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాం. ఆశించిన దిగుబడి వస్తే కాస్త ఇబ్బంది ఉండదు.–  కేఆర్‌.లత,జిల్లా ఉద్యాన అధికారి, జనగామ

మరిన్ని వార్తలు