ఆ పార్కులో అన్నీ సమస్యలే   

4 Sep, 2018 12:22 IST|Sakshi
పార్కులో నుంచి విద్యార్థులను బయటికి పంపిస్తున్న సిబ్బంది 

పనులు జరుగుతున్నాయని అనుమతించని సిబ్బంది

సెలవు రోజు మూసివేత

వికారాబాద్‌ అర్బన్‌ : మున్సిపల్‌ కార్యాలయం పక్కనే ఉన్న గాంధీ పార్కులో పిల్లలు ఆడుకోవడానికి సిబ్బంది అనుమతించడం లేదు. ఇదేమిటని అడిగితే పనులు జరుగుతున్నాయని, అక్కడ ఏర్పాటు చేసిన ఆట వస్తువులు చెడగొడుతున్నారని సిబ్బంది చెబుతున్నారు. సుమారు రూ.30 లక్షలతో చేపట్టిన గాంధీ పార్కు అభివృద్ధి పనులు మధ్యలో ఆగిపోయి రెండు మాసాలు కావస్తోంది. సంబంధిత కాంట్రాక్టు అసంపూర్తిగా పనులు చేసి వెళ్లిపోయారు. అధికారులు పట్టించుకోవడంలేదు.

దీంతో పార్కుకు తాళం వేసేస్తున్నారు. సెలవు రోజు పిల్లలు పార్కులో ఆడుకుందామని వస్తున్నా గేట్లకు వేసిన తాళాలు చూసి వెళ్లిపోతున్నారు. లక్షల రూపాయలు ఖర్చచేసి కొనుగోలు చేసిన పిల్లల ఆటు వస్తువులు ఆడుకునే వారు లేక బోసిపోతున్నాయి. పార్కులో కొంత మేరా గ్రీన్‌మ్యాట్‌ వేసినా సక్రమంగా లేక పిచ్చిమొక్కలు మొలిశాయి.

అనేక చోట్ల పూల మొక్కలు ఎండిపోతున్నా సిబ్బంది పట్టించుకోవడంలేదు. ఆది, సోమవారాలు రెండు రోజులు వరుసగా సెలవులు వచ్చినా పిల్లలను పార్కులోకి అనుమతించలేదు. పిల్లలు ఆడుకోవడానికి అనుమతించకుంటే లక్షలు ఖర్చుచేసినా లాభముండదని పట్టణవాసులు పేర్కొంటున్నారు.  

మరిన్ని వార్తలు