ఆర్థిక మందగమనమే

3 Oct, 2019 03:12 IST|Sakshi

నోట్ల రద్దు, జీఎస్టీపై పలువురు వక్తలు

మంథన్‌ సంవాద్‌ కార్యక్రమంలో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: నోట్ల రద్దు నిర్ణయం, జీఎస్టీ విధానంతో దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం చోటు చేసుకుందని ప్రముఖ పాత్రికేయులు వివేక్‌ కౌల్‌ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన మంథన్‌సంవాద్‌ కార్యక్రమంలో ఆయన ‘ది గ్రేట్‌ఎకనమిక్‌ స్లో డౌన్‌’ అనే అంశంపై ప్రసంగించారు. ఆర్థిక వ్యవస్థలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామంతో చిన్న పరిశ్రమలు చితికిపోయాయని తెలిపారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని అన్నారు. ప్రజల తలసరి ఆదాయం కూడా తగ్గుతోందని తెలిపారు. కార్పొరేట్లకు అను కూలంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో వారికే గరిష్ట ప్రయోజనం కలుగుతోందన్నారు. ప్రభుత్వానికి రుణభారం పెరిగి వడ్డీలు తడిసి మోపెడవుతున్నాయన్నారు.

గాంధీ ఆదర్శప్రాయంగా నిలిచారు..
సత్యాగ్రహం, అహింస, సత్యంతో తాను చేసిన ప్రయోగాలతో మహాత్మాగాంధీ నాటికీ.. నేటికీ అన్ని దేశాలకు.. అన్ని వర్గాలకు ఆదర్శప్రాయంగా నిలిచారని ప్రముఖ ఫిలాసఫర్స్‌ దివ్య ద్వివేదీ, షాజ్‌హాన్‌లు అన్నారు. ‘గాంధీస్‌ ట్రూత్‌’ అనే అంశంపై వారు ప్రసంగించారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంతో పాటు దేశంలోని అన్ని రంగాల్లో గుణాత్మక మార్పులను ఆయన ఆకాంక్షించడంతో పాటు అందుకు నడవాల్సిన దారిని చూపారని కొనియాడారు.

స్వాతంత్య్రమే కీలకం
‘లిబర్టీ అండ్‌ ది బిగ్‌ స్టేట్స్‌’ అనే అంశంపై ప్రము ఖ పాత్రికేయురాలు సాగరికా ఘోష్‌ మాట్లాడుతూ.. దేశంలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. సామా జిక, ఆర్థిక రంగాల్లో అన్ని వర్గాలకు స్వాతంత్య్రం, స్వేచ్ఛ లభించాలన్నారు. కేరళలో పౌరసమాజం తమ  హక్కుల సాధనకు రాజకీయ నేతలను ప్రశ్నించడం శుభపరిణమమన్నారు.

అలరించిన కామెడీ
ప్రముఖ టీవీ యాంకర్‌ అజీమ్‌ బనత్‌వాలా సమకా లీన అంశాలు, రాజకీయా లపై నిర్వహించిన లైవ్‌ కామెడీ షో ఆహూతులను అలరించింది. దేశం లో చోటుచేసుకుంటున్న మతపరమైన అసహనం, గోరక్షణ పేరుతో సాగుతున్న ఆకృత్యాలు వంటి వాటిపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ అందరినీ నవ్వించడంతో పాటు ఆలోచింపజేయడం ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 

మరిన్ని వార్తలు