సాక్షి, కొత్తగూడెం: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్య ప్రాంతం నుంచి తెలంగాణలోని వివిధ జిల్లాల్లోని ప్రధాన పట్టణాల వరకు కార్యకలాపాలు విస్తరించేందుకు మావోయిస్టులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. గత ఏడాది కాలంగా తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎడతెగని పోరు నడుస్తోంది. భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టులు పేల్చిన మందుపాతరల కారణంగా పలువురు భద్రతా బలగాల సిబ్బంది మరణించారు. కొందరు ప్రజాప్రతినిధులను, కాంట్రాక్టర్లను మావోలు హత్య చేశారు. ఈ క్రమంలో గత డిసెంబర్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్ శాసనసభ ఎన్నికలు జరిగాయి.
ఆ ఎన్నికల సందర్భంగా మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల పరిధిలోనూ అనేక విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడ్డారు. సరిహద్దుకు అవతల వైపు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, దంతెవాడ, సుక్మా, నారాయణపూర్, కాంకేర్ జిల్లాల్లో నిరంతరం పోలీసులు మావోయలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. దండకారణ్యం దద్దరిల్లుతోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా నుంచి తెలంగాణలోని భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, దంతెవాడ, సుక్మా, నారాయణపూర్, కాంకేర్, ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఒడిశాలోని మల్కనగిరి, కోరాపుట్), ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి, విశాఖపట్టణం జిల్లాల వరకు మావోలు విధ్వంస కార్యకలాపాలకు మావోలు పాల్పడుతున్నారు. మూడు నెలల క్రితం విశాఖపట్టణం జిల్లా అరకు సమీపంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు హత్య చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఐదు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో ముందుకు వెళుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు రావడంతో మావోయిస్టులు తమ కార్యకలాపాలను మరింత ఉధృతం చేసేందుకు, సరిహద్దు అటవీ ప్రాంతాలు, ఏజెన్సీ నుంచి దాటి వివిధ జిల్లాల్లోని మైదాన ప్రాంతాలకు చొచ్చుకుని వచ్చేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
పట్టణ ప్రాంతాల్లోనూ బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాలు...
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందు నుంచే మావోయిస్టులు ఎన్నికలను బహిష్కరించాలంటూ తమ కార్యకలాపాలను మరింత ముమ్మరం చేస్తున్నారు. ఈ నెల మొదటి వారం నుంచి మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఆంధ్రా–ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో వరుసగా ప్రకటనలు వస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ మండలాల్లో పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లను మంగళవారం వదిలారు.
ఎన్కౌంటర్
తాజాగా, మంగళవారం భద్రాచలం ఏజెన్సీ సరిహద్దులోని సుక్మా జిల్లా చింతల్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. కొన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు తమ కార్యకలాపాలను పెంచేందుకు ప్రయత్నిస్తుండడంతో పోలీసు యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు సరిహద్దు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమవుతూ సమన్వయంతో ముందుకు వెళుతున్నారు. దండకారణ్యంలో నిరంతరం కూంబింగ్ సాగిస్తున్నారు. నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.