కదలికలు లేవన్న కొన్ని గంటల్లోనే మావోయిస్టుల హెచ్చరికలు
ఎన్నికలు బహిష్కరించాలని పిలుపు
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి : రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల పండగ మొదలవనున్న నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లిలో మావోయిస్టుల హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి. ముందస్తు ఎన్నికలు బూటకమనీ, వాటిని బహిష్కరించాలని పిలుపునిస్తూ మావోయిస్టులు వేసిన పోస్టర్లు, కరపత్రాలు అలజడి సృష్టిస్తున్నాయి. జిల్లాలోని చర్ల, వెంకటాపురం, మహదేవ్ పూర్, కాటర్ మండలాల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొన్ని చోట్ల ముందస్తు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు కరపత్రాల్లో పేర్కొన్నారు.
టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ జనసమితీ సహా అన్ని పార్టీలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని కరపత్రాల్లో మావోయిస్టులు వెల్లండించారు. ఇలాంటి పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. ముందస్తు ఎన్నికలు ప్రజాస్వామ్యనికీ విరుద్దంగా ఉన్నాయని ఏటూరు నాగారం - మహదేవ్పూర్ ఏరియా కమిటీ పేరుతో ఈ కరపత్రాలు బ్యానర్లు వెలిశాయి.
ఇదిలాఉండగా.. భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టు కదలికలు లేవని నార్త్జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ నాగిరెడ్డి మీడియా సమావేశంలో చెప్పిన కొన్ని గంటల్లోనే ఈ కరపత్రాలు, బ్యానర్లు వెలువడడం పోలీసులకు సవాల్గా మారింది.