టీఆర్‌ఎస్‌ నేతల హత్యకు మావోయిస్టుల పక్కా ప్లాన్‌!

15 Nov, 2018 10:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రజాప్రతిధులను మావోయిస్టులు టార్గెట్‌ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోములను ఎలాగైతే హత్య చేశారో అదే తరహాలో.. తెలంగాణలోని ఎమ్మెల్యేలను అంతం చేస్తామని మావోయిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మావోయిస్టు యాక్షన్‌ టీమ్స్‌.. తెలంగాణకు చెందిన ఓ ఆపద్ధర్మ మంత్రి,  స్పీకర్‌ను టార్గెట్‌ చేసినట్టు సమాచారం. అదేవిధంగా తాడ్వాయి టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డిని హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.

మావోయిస్టుల కుట్రను పసిగట్టిన తెలంగాణ పోలీసులు అలర్ట్‌ కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. మావోయిస్టుల ముప్పు గురించి పోలీసులు సమాచారం ఇవ్వడంతో మంత్రి అజ్మీరా చందూలాల్‌  తాడ్వాయ్ మండలంలోని కటాపూర్‌లో ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే ముగించి వెనుదిరిగారు. ఈ యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా రంగంలోకి దిగిన 30 మంది మావోయిస్టులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు