బోథ్‌ టు హైదరాబాద్‌..  

31 Aug, 2018 14:58 IST|Sakshi
గంజాయి (ఫైల్‌)

గంజాయి రవాణా.. 

పబ్బులకు చేరవేస్తున్నయువకులు

వాచ్‌మెన్‌లుగా పనిచేస్తూ గంజాయి విక్రయాలు

ధనికులే టార్గెట్‌ వీకెండ్‌లలో  హైదరాబాద్‌కు పయనం

జల్సాల కోసం దారి తప్పుతున్న యువత

అంతర పంటగా  గంజాయి సాగు

బోథ్‌ : బోథ్‌ మండలం నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయి రవాణా అవుతోంది. కొంతమంది యువకులు హైదరాబాద్‌కు వెళ్తున్నానంటూ బ్యాగుల్లో గంజాయి తీసుకెళ్తున్నారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పబ్బుల వద్ద విక్రయిస్తున్నారు. పబ్బులకు వచ్చే ధనికులు, యువకులు, సెలబ్రటీలకు గంజాయిని అమ్ముతున్నట్లు సమాచారం. వీకెండ్‌లలో హైదరాబాద్‌ వెళుతూ విక్రయిస్తున్నారు. మరికొందరు  హైదరాబాద్‌లో వాచ్‌మెన్‌లుగా ఉండి గంజాయి విక్రయాలు చేస్తున్నారు. వారానికి దాదాపు 20 నుంచి 30 వేల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. దీంతో గంజాయి రవాణ వారికి వృత్తిగా మారింది. వచ్చిన డబ్బులతో జల్సా చేస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. 

వాచ్‌మెన్‌లుగా పనిచేస్తూ..

బోథ్‌ మండలంలో సొనాల గ్రామ చుట్టు పక్కల గ్రామాల్లోని దాదాపు 20 నుంచి 30 మంది యువకులు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజరా హిల్స్, దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేట్, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్‌సీటీ తదితర ప్రాంతాల్లో  వివిధ పబ్బులల్లో, పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్‌లల్లో వాచ్‌మెన్‌లుగా పనిచేస్తున్నారు. వీరంతా 18 నుంచి 30 సంవత్సరాలలోపు యువకులే..ఈ ప్రాంతాల్లో చాలా మంది ధనికులు, సెలబ్రటీస్‌లు తిరుగుతూ ఉంటారు. పబ్బుల్లో రాత్రిపూట గంజాయిలు విక్రయిస్తూ వేల కొద్ది డబ్బును సంపాదిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లల్లో ఉండే ధనికులకు ప్రతీవారం గంజాయిని సరఫరా చేస్తున్నారు. తమ వాచ్‌మెన్‌ తన గ్రామం నుంచి గంజాయి తెచ్చివ్వడంతో తక్కువ ధరలకు కొంటున్నారు. 

గుట్టుచప్పుడు కాకుండా రవాణా

గంజాయిని హైదరాబాద్‌కు గుట్టు చప్పుడు కాకుండా తీసుకెళ్తుతున్నారు. తాము తీసుకెళ్లే బ్యాగులో గంజాయిని ఉంచి వాసన రాకుండా దానికి సెంట్‌ కొడుతున్నారు. ఎవరికి అనుమానం రాకుండా బోథ్‌ మండల కేంద్రం నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సులో ఒక వారం, మరోవారం నిర్మల్‌ నుంచి హైదరాబాద్‌కు బయలు దేరుతున్నారు. రాత్రుల్లో పబ్బుల వద్ద ఒక వ్యక్తికి విక్రయించి డబ్బులు తీసుకుని వచ్చేస్తున్నారు. మరోవైపు వాచ్‌మెన్‌లుగా , సెక్యురిటీ గార్డులుగా పనిచేస్తున్న వ్యక్తులు తమ ఇంటి వద్ద నుంచి యువకులతో గంజాయిని తెప్పించుకుని గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. ఈ తతంగం గత సంవత్సర కాలంగా నడుస్తోందని తెలుస్తోంది. అయితే హైదరాబాద్‌కు సరఫరా చేసే యువకుల్లో ఎక్కువగా ఇంటర్, డిగ్రీలు చేస్తున్న విద్యార్థులు సైతం ఉన్నట్లు సమాచారం.. వీరికి గంజాయిని హైదారాబాద్‌కు తీసుకువస్తే డబ్బులు ఇస్తామంటూ వల వేస్తున్నారు. దీంతో గంజాయిని తీసుకువెళ్లి అక్కడ ఉండే వాచ్‌మెన్‌లకు సరఫరా చేస్తున్నారు. 

ఈజీ మనీకి అలవాటు పడి..

చాలా మంది యువకులు గంజాయినీ సరఫరా చేస్తే డబ్బులు రావడం గమనించడంతో ఈజీగా డబ్బులు వస్తున్నాయని ఆశపడి రవాణా చేస్తున్నారు. వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. ఓ యువకుడు తమ ఇంటి వద్ద తన తండ్రి కూలీ పనులకు వెళుతుంటే తాను మాత్రం బైక్‌పై స్మార్ట్‌ఫోన్‌తో జల్సా చేస్తున్నాడు. అదేంటి అని ఓ వ్యక్తి అడిగితే..‘అన్న హైదరాబాద్‌కు గంజాయి ఇచ్చి వస్తే వారానికి 4 వేలు ఇస్తున్నారు.’’ అని సమాధానం చేప్పి వెళ్లిపోయాడు. దీన్ని బట్టి చూస్తే గంజాయి రవాణా ఎలా సాగుతోందో అర్థం అవుతోంది. 

బోథ్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తి బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో  వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఆ అపార్ట్‌మెంట్‌లో ఉండే కొంత మంది వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. దీంతో ఆ వ్యక్తులకు గంజాయిని బోథ్‌ మండలం నుంచి సరఫరా చేస్తున్నాడు. ప్రతీవారం తన గ్రామం నుంచి కొంతమంది యువకులతో గంజాయిని తెప్పించుకుని సరఫరా చేస్తూ వారానికి 20 నుంచి 30 వేల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. అక్కడే ఉన్న పబ్బులో ఓ వ్యక్తి ద్వారా గంజాయి సప్‌లై చేస్తున్నారు.

అంతర పంటగా సాగు...

హైదరాబాద్‌లో గంజాయికి భారీ డిమాండ్‌ ఉండటంతో బోథ్‌ మండలంలోని కొన్ని చేలల్లో గంజాయని అంతరంపంటగా సాగు చేస్తున్నారు. దీన్ని యువకులతో హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. మూడు నుండి ఐదుగురు వ్యక్తులు బస్సుల్లో హైదరాబాద్‌కు తీసుకువెళుతున్నారు.

గంజాయి రవాణా చేస్తున్న వారిపై క్రిమినల్‌ కేసులు

గంజాయి పంటను వేసినా.. గంజాయిని హైదరాబాద్‌ వంటి ఇతర ప్రదేశాలకు రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు, క్రిమినల్‌ కేసులు పెడతాం. యువకులు గంజాయిని రవాణా చేసి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఆయా గ్రామాల్లో తనిఖీలు చేపడతాం. అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. ఎవరైనా గంజాయిని తరలిస్తున్నట్లయితే పోలీసులకు సమాచారం అందించాలి. 

- జయరాంనాయక్, సీఐ  
 

మరిన్ని వార్తలు