హైదరాబాద్, రంగారెడ్డి, నిర్మల్లో అధికంగా నమోదు
ఖమ్మం జిల్లాలో కొత్తగా రెండు కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్ : కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మర్కజ్ ఘటనకు సంబంధం ఉండటంతో వివిధ జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం నమోదైన 49 కేసుల్లో అత్యధికం హైదరాబాద్, నిర్మల్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 17, నిర్మల్ జిల్లాలో 6, హైదరాబాద్లో మరో 11 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 25 జిల్లాలకే పరిమితమైన కరోనా, ఖమ్మం జిల్లాకూ పాకింది. దీంతో కరోనా కేసులు నమోదైన జిల్లాల సంఖ్య 26కు చేరింది.
‘హాట్స్పాట్’ల్లో 3.5 లక్షల మందిని కలసిన బృందాలు..
రాష్ట్రంలో అత్యధికంగా కేసులు పెరుగుతుండటంతో హాట్స్పాట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. బుధవారం సాయంత్రానికి రాష్ట్రంలో 125 హాట్స్పాట్లను గుర్తించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఆయా ప్రాంతాల్లో 3,500 వైద్య బృందాలు 60 వేల ఇళ్లకు తిరిగి 3.5 లక్షల మంది ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నాయి. వారికెవరికైనా జలుబు, జ్వరం, దగ్గు ఉంటే వెంటనే క్వారంటైన్లో ఉండాలని చెబుతున్నారు. తీవ్రమైతే ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారు. హాట్స్పాట్లలో ప్రధానంగా హైదరాబాద్లోనే 60 ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత రంగారెడ్డి, నిజా మాబాద్, కామారెడ్డి, గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, కరీంనగర్, వరంగల్లో కొన్ని ప్రాంతాలను హాట్ స్పాట్లుగా గుర్తించారు. ఇంటింటికి వెళ్లి వారికేమైనా విదేశీ ప్రయాణ చరిత్ర ఉందా? మర్కజ్కు వెళ్లొచ్చిన వారితో సంబంధాలు ఉన్నాయా? కరోనా పాజిటివ్ వ్యక్తులను కలిశారా? వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారా? వైరస్ అనుమానిత లక్షణాలు ఏమైనా ఉన్నాయా? లాంటి తదితర వివరాలను వైద్య ఆరోగ్య సిబ్బంది సేకరించింది. కాగా, తొలుత ఇక్కడ ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాలని అనుకున్నారు. అయితే ఆయా హాట్స్పాట్ ప్రాంతాల్లో వైరస్ సామూహికంగా వ్యాప్తి చెందకపోవడంతో ర్యాపిడ్ పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.
1,425 మందికి నెగిటివ్
మర్కజ్ నుంచి వచ్చిన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల్లో 1,425 మందికి కరోనా లేనట్లు వైద్య, ఆరోగ్యశాఖ నిర్ధారించింది. వారందరికీ వైద్య పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం సర్కారుకు నివేదిక అందజేసింది. రాష్ట్రం నుంచి ఢిల్లీ మర్కజ్కు వెళ్లొచ్చిన వారు 1,089 మంది ఉన్నారు. వారు 2,421 మంది కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి తిరిగారు. దీంతో మొత్తం 3,510 మందిని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు గుర్తించాయి. వారిలో ఇప్ప టివరకు 2,364 మంది శాంపిళ్లను సేకరించారు. ఇంకా 603 శాంపిళ్ల పరీక్షలు చేయాల్సి ఉందని నివేదిక తెలిపింది.