మర్కజ్‌ దెబ్బ!

8 Apr, 2020 01:54 IST|Sakshi

146 మంది విదేశీయులపై వీసా, లాక్‌డౌన్‌ ఉల్లంఘన కేసులు

వారికి ఆశ్రయమిచ్చిన వారిపైనా నమోదు

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీలోని మర్కజ్‌ ప్రార్థనల పర్యవసానాలు దేశం, రాష్ట్రంపై తీవ్రంగా ప్రభావం చూపిన నేపథ్యంలో వారిపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. మర్కజ్‌ ప్రార్థనల కోసం వచ్చిన విదేశీయులు పలువురు విజిటింగ్‌ వీసాతో దేశానికి రావడమే కాకుండా, కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా.. నిబంధనలు ఉల్లంఘిస్తూ.. దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించి స్థానికులకు కూడా వైరస్‌ ను వ్యాపింపజేశారు. దీంతో సోమవారమే కేసుల నమోదు ప్రారంభించిన తెలంగాణ పోలీసులు మంగళవారం రాత్రి 146 మంది విదేశీయులపై వీసా ఉల్లంఘనల కింద కేసులు నమోదు చేశారు. వీటిలో హైదరాబాద్‌లో 84 మంది విదేశీయులపై 10 కేసులు నమోదయ్యాయి. ఇందులో విదేశీయులకు ఆశ్రయమిచ్చిన వారిపైనా పోలీసులు కేసులు పెట్టారు. విదేశాల నుంచి రాష్రానికి వచ్చిన వారిలో ఇండోనేసియా, కిర్గిస్తాన్, మలేషియా, వియత్నాం, మయన్మార్‌కు చెందిన వారు ఉన్నారు. వీరందరిలో అత్యధికంగా నల్లగొండలో 36 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో 18 మంది మయన్మార్, వియత్నాంకు చెందిన 14 మంది ఉన్నారు. వీరికి ఆశ్రయమిచ్చిన వారిపైనా కేసులు నమోదయ్యాయి. కరీంనగర్‌లో పర్యటించిన 14 మంది ఇండోనేసియన్లతో పాటు, వారికి ఆశ్రయమిచ్చినవారిపైనా కేసులు పెట్టారు.

కేంద్ర హోం శాఖ ఆదేశాలతో..
విదేశీయులకు కరోనా పాజిటివ్‌ రావడంతో కలకలం రేగింది. దీనిపై విచారణ ప్రారంభించిన కేంద్ర హోం శాఖ వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. వీరంతా విజిటింగ్‌ వీసాలపై భారత్‌కు వచ్చినట్లు గుర్తించిన హోం శాఖ.. వారంతా ఎక్కడెక్కడున్నా రో వెంటనే గుర్తించి, వారి వీసాలు పరిశీ లించాలని ఆదేశించింది. అందులో వీసా, లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘనలు ఉంటే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. మార్చి 16న కరీంనగర్‌కు వచ్చిన 14 మంది సభ్యులున్న ఇండొనేసియావాసుల వల్ల కరోనా కేసులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి మర్కజ్‌లో అసలేం జరుగుతోందో తెలంగాణ ప్రభుత్వమే కేంద్రానికి విన్నవించింది.

మరిన్ని వార్తలు