సాక్షి, హైదరాబాద్: ప్రజల సంక్షేమం మరిచిపోయి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడంలో సీఎం కేసీఆర్ వ్యవహార శైలి పిచ్చి తుగ్లక్ను మించిపోయిందని మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి విమర్శించారు. గురువారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ సచివాలయాన్ని కూల్చేసి, డిఫెన్సు భూమిలో కొత్త సచివాలయం నిర్మిస్తామని కేసీఆర్ నిర్ణయించడం వెనుక కుట్ర ఉందన్నారు.
ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిని తరలించి, ఆ ప్రదేశంలో సచివాలయాన్ని నిర్మించాలని గతంలో ప్రయత్నాలు చేశారన్నారు. సచివాలయం 60 శాతం ఖాళీగా ఉన్నదని, కొత్త సచివాలయం అవసరం ఏమిటని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల ద్వారా వచ్చే కమీషన్ డబ్బుల కోసమే కేసీఆర్ కొత్త భవనాలు కట్టాలన్న యోచనలో ఉన్నాడని మర్రి శశిధర్రెడ్డి ఆరోపించారు. కొత్త సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకుని తీరుతామన్నారు.