ఊరిలోనే పెళ్లి రిజిస్ట్రేషన్‌.. 

22 Jun, 2019 12:11 IST|Sakshi
మాట్లాడుతున్న మహిళా శక్తి కో–ఆర్డినేటర్‌ అరుణ

‘మహిళా శక్తి’ఆధ్వర్యంలో అధికారులకు అవగాహన 

సాక్షి, వనపర్తి: ఇప్పటి వరకు వివాహా రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. దీంతో ప్రజలు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. ప్రజల ఇబ్బందులు గుర్తించిన ప్రభుత్వం వివాహ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో మార్పు లు చేసింది. ఇకపై వివాహం జరిగిన పంచాయతీలోనే కార్యదర్శితో పెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ విషయంపై అవగాహన కల్పిం చేందుకు శుక్రవారం జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో పంచాయతీ కార్యదర్శులకు, మున్సిపల్‌ కమిషనర్లకు, ఎంపీడీఓలకు జిల్లా వెల్పేర్‌ అధికారి ఆధ్వర్యంలో ఒక్కరోజు ఓరియంటేషన్‌ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మహిళా శక్తి కేంద్రం మహబూబ్‌నగర్‌ కో–ఆర్డినేటర్‌ అరుణ మారిన నిబంధనలు, పెళ్లి రిజిస్ట్రేషన్‌ చేయించుకునే అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లాలో పెళ్లిళ్ల రిజిస్ట్రార్‌గా కలెక్టర్, అదనపు రిజిస్టార్‌గా జిల్లా సంక్షేమ అధికారి పని చేస్తారని చెప్పారు.  

30రోజుల్లో అయితే ఉచితంగానే..  
వివాహం జరిగిన రోజు నుంచి 30 రోజుల్లోగా సంబంధిత పంచాయతీ కార్యద ర్శితో పెళ్లి కుమారుడుగాని, పెళ్లికూతురుగాని ఎవరి తల్లితండ్రులైనా.. కార్యదర్శి వద్దకు వచ్చి రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు ఇవ్వాలి. ఈ దరఖాస్తుపై ఇరుపక్షాల సాక్షులు సంతకాలు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులో పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురు వయస్సు తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. కార్యదర్శి పంచాయతీ కార్యాలయంలో పెళ్లిళ్ల రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన వారితో సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంది.

రెండు నెలల్లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి రూ. 100ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మున్సిపాలిటీ కేంద్రాల్లో జరిగిన పెళ్లిల వివరాలు మున్సిపల్‌ కమిషనర్‌ రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇలా రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే చట్టబద్దత ఉంటుందన్నారు. కుటుంబానికి వర్తించే  అన్ని ప్రభుత్వ పథకాలు ఈ రిజిస్ట్రేషన్‌ ఎంతో దోహదపడుతుంది. కార్యక్రమంలో జిల్లా వెల్పేర్‌ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రజినీకాంత్‌రెడ్డి, ఎంపీడీఓలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు