వివాహేతర సంబంధం గుట్టురట్టు 

14 Feb, 2020 11:26 IST|Sakshi
సతీష్‌ భార్యను లాగివేస్తున్న పోలీసులు

ప్రియురాలితో ఉన్న భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

100కు డయల్‌ చేసి పోలీసుల సాయం కోరిన వివాహిత   

సాక్షి, పరిగి: గుట్టుగా కాపు కాసిన భార్య.. భర్త వివాహేతర సంబంధాన్ని రట్టు చేసింది. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకోవటం కలకలం రేపింది. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా పరిగి టీచర్స్‌ కాలనీలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్దారం గ్రామానికి చెందిన సతీష్‌ ఖమ్మంలోని స్వరాజ్‌ ట్రాక్టర్‌ షోరూంలో మేనేజర్‌గా విధులు నిర్వహించే వాడు. ఇతనికి  2006లో ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన భవానితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా సతీష్‌ ఉద్యోగ రీత్యా గత ఏడాదిన్నర క్రితం కొత్తగూడెం బదిలీ అయ్యాడు. అక్కడ మరో మహిళతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది.

కొద్ది రోజుల తర్వాత భార్యకు విషయం తెలియడంతో గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో అతను తన ఉద్యోగాన్ని వికారాబాద్‌ జిల్లా పరిగిలోని స్వరాజ్‌ ట్రాక్టర్‌ షోరూంకు బదిలీ చేయించుకున్నాడు. కొంత కాలంగా పరిగిలోని టీచర్స్‌ కాలనీలో నివాసం ఉంటూ తన భార్యను కొత్తగూడెంలోనే ఉంచి, పరిగిలో తన ప్రేయసితో సహజీవనం చేస్తున్నాడు. విషయం పసిగట్టిన భార్య గురువారం పరిగికి చేరుకుని అతను అద్దెకు ఉండే గదికి వెళ్లింది. డోర్‌ పెట్టి ఉండటంతో తీయమని కోరింది. వారు డోర్‌ తీయకపోవటంతో 100కు డయల్‌ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు అక్కడికి చేరుకుని డోర్‌ తెరిపించారు. గదిలోంచి సతీష్‌తో పాటు తాను సహజీవనం చేస్తున్న మహిళ బయటకు వచ్చింది. వెంటనే  సతీష్‌ భార్య తన భర్తతో ఉంటున్న మహిళ జుట్టు పట్టుకుని గొడవకు దిగింది. ఇద్దరూ జుట్లు పట్టుకున్నారు. ఈ క్రమంలో మహిళా పోలీసులు లేకపోవటంతో మగ పోలీసులే అతని భార్య చేతులు పట్టుకుని లాగి పడేశారు. దీంతో ఆమె తాను ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆమెను పట్టించుకోకుండా తననే లాగి పడేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం వారిని పోలీసులు పరిగి పీఎస్‌కు తరలించారు. ఆమె లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదని తనకు తన భర్త వస్తే చాలు అనడంతో పోలీసులు ముగ్గురినీ వదిలేశారు. 

మరిన్ని వార్తలు