వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

7 May, 2015 01:14 IST|Sakshi

నాగార్జునసాగర్: వేధింపులు తాళలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన నాగార్జునసాగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తునికినూతల తండాలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లి మండలం కేశంనేనిపల్లితండాకు చెందిన స్వాతికి 7సంవత్సరాల క్రితం పెద్దవూర మండలం తునికినూతల తండాకు చెందిన కొర్రబాబుతో వివాహం జరిగింది. వీరికి కుమార్తె లలిత(4)కుమారుడు సిద్దు(2) జన్మించారు. ఇటీవల కొర్రబాబు భార్యపై అనుమానంతో నిత్యం వేధిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి స్వాతిపై చేయికూడా చేసుకున్నాడు.

 దీంతో మనస్తాపానికి గురైన స్వాతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులమందు తాగింది. బయటి నుంచి తిరిగొచ్చిన కొర్రబాబు అపస్మారకస్థితిలో పడి ఉన్న భార్యను సాగర్ కమలా నెహ్రూ ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందింది. పెద్దవూర తహసీల్దార్ ఖలీల్ హైమద్ శవ పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. భర్త వేధింపులతోనే స్వాతి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రజనీకర్ తెలిపారు.
 

మరిన్ని వార్తలు