వివాహిత అనుమానాస్పద మృతి

28 Jan, 2015 20:39 IST|Sakshi

పెద్దేముల్: ఓ వివాహిత హత్యకు గురైన సంఘటన రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండల మంబాపూర్ గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం....లలిత(48) మూడేళ్లుగా మాంబాపూర్ గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటూ కూరగాయల వ్యాపారం చేసి జీవించేది. యథావిధిగా లలిత మంగళవారం తాండూరులో కూరగాయలు అమ్మి సాయంత్రం ఇల్లు చేరింది. బుధవారం ఉదయం లలిత ఇంటి తలుపు సందులోంచి చీర వేలాడుతూ కనిపించడంతో గ్రామస్తులు తలుపు తెరిచి చూడగా లలిత శవమై పడి ఉంది. గొంతుకు టవలుతో ఉరి బిగించినట్లు ఉండడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.

ఎఎస్పీ వెంకటస్వామి, తాండూరు డీఎస్పీ షేక్‌ఇస్మాయిల్, రూరల్ సీఐ శివశంకర్, పెద్దేముల్ ఎస్‌ఐ రమేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసు జాగిలం గ్రామంలోని దొడ్డు ఆనందం ఇంట్లోకి వెళ్లి చాలాసేపు అక్కడే ఉండటంతో పొలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆనందంతో పాటు అతడి కుమారుడిని వెంకటస్వామి విచారించారు. పంచనామా నిర్వహించి లలిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం: ఏఎస్పీ
లలిత మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని, దోషులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని అడిషనల్ ఎస్పీ వెంకటస్వామి చెప్పారు.
 

మరిన్ని వార్తలు