మారుతీరావుకు మద్దతుగా శాంతి ర్యాలీ

25 Sep, 2018 09:09 IST|Sakshi
ధర్నా నిర్వహిస్తున్న వ్యాపారులు

సాక్షి, నల్లగొండ : మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ హత్య కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మారుతీరావుకు మద్దతుగా తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో శాంతిర్యాలీ నిర్వహించారు. స్థానిక వాసవీభవన్‌ నుంచి జిల్లా జైల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. జైల్‌లో మారుతీరావుని కలిసేందుకు ములాఖాత్‌ కోరగా అందుకు పోలీస్‌ అధికారులు నిరాకరించారు. జైల్‌లో ఉన్న మారుతీరావు సోదరుడు శ్రవణ్‌ను ములాఖాత్‌ పై కలిసారు. ఆ తర్వాత కలెక్టర్, ఎస్పీలను కలిసి వేర్వేరుగా వినతిపత్రాలను అందజేసారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ప్రణయ్‌ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. విగ్రహం ఏర్పాటు వల్ల భావిసమాజానికి చెడుసంకేతాలు వెళతాయన్నరు.ఎస్సీ అట్రాసిటీ కేసు చెల్లదని మేజర్‌ అయినప్పటికీ ప్రేమ వివాహల్లో తల్లిదండ్రుల అంగీకారం ఉండేలా చట్ట సవరణ చేయాలని కోరారు. కార్యక్రమంలో యామ మురళి,రాజు, జనార్దన్, సురేందర్, భిక్షపతి, ఈశ్వర్, శ్ర్రీను, కోటగిరి దైవాదీనం, శేఖర్‌ పాల్గొన్నారు.

ప్రణయ్‌ విగ్రహం పెట్టొద్దని ధర్నా 
మిర్యాలగూడ : పట్టణ నడిబొడ్డున ఇటీవల హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌ విగ్రహం పెట్టొద్దని వ్యాపారులు సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పెరుమాళ్ల ప్రణయ్‌ హత్యకు గురికావడం చాలా బాధాకరమైన విషయమన్నారు. కానీ పట్టణ నడిబొడ్డున ప్రణయ్‌ విగ్రహం పెడితే భవిష్యత్‌లో యువత అదేబాటలో నడుస్తారని భయపడుతున్నామని ఆందోళనవ్యక్తం చేశారు. అతను చేసిన త్యాగాలు ఉంటే విగ్రహం ప్రతిష్ఠించాలని, ఇలాంటి వారికి నడిరోడ్డుపై విగ్రహాలు పెడితే మహానుభావులకు చిన్నచూపుగా ఉంటుందన్నారు. అనంతరం ప్రణయ్‌ విగ్రహ ప్రతిష్ఠను ఆపాలని ఆర్డీఓ జగన్నాధరావుకు వినతిపత్రం అందేశారు. కార్యక్రమంలో సమీఖాద్రి, సత్యనారాయణ, శ్రీనివాస్, యాదగిరి, రాములు, నాగేందర్, కిష్టయ్య, వెంకటేశ్వర్లు, ఫయాజ్, సైదయ్య ఉన్నారు. 

ప్రణయ్‌ కుటుంబానికి పరిహారం వర్తించదు
నల్లగొండ టూటౌన్‌ : మిర్యాలగూడలో ఇటీవల హత్యకు గురైన ప్రణయ్‌కు  షెడ్యూల్‌ క్యాస్ట్‌కు వర్తించే వాటిని ఇవ్వవద్దని కోరుతూ తెలంగాణ మాల యువసేన రాష్ట్ర అధ్యక్షుడు గోలి ప్రభాకర్‌ సోమవారం  కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రణయ్‌ ఎస్సీ కాదని, అతని కుటుంబం క్రిష్టియన్‌ అని తెలిపారు. ప్రణయ్‌ అంత్యక్రియలు క్రైస్తవ ఆచారం ప్రకారం నిర్వహిం చారని కలెక్టర్‌కు వివరించారు. ప్రణయ్‌ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు తదితర వాటిని ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఇచ్చే పరి హారం అతని కుటుంబానికి వర్తించదని పేర్కొన్నారు.  

చదవండి:
అమృతను చట్టసభలకు పంపాలి

అమృతకు వ్యవసాయభూమి, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు

ప్రణయ్ విగ్రహం: కేటీఆర్ అనుమతి ఇవ్వాలి!

>
మరిన్ని వార్తలు