మ్యాచ్ ఫిక్సింగే..!

17 Dec, 2014 01:57 IST|Sakshi

మహబూబ్‌నగర్ టౌన్: జిల్లాలో డీపీసీ(జిల్లా ప్రణాళిక మండలి)సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామీణ సభ్యుల కోటాలో 21 మంది ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని జాబితా విడుదల చేశారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు కాగా, ఒకేసారి 10మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడం, 21 స్థానాలకు 21మంది అభ్యర్థులు మిగలడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు.
 
  జిల్లాలో 21స్థానాలకు ఎన్నికలు నిర్వహిం చగా అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలుచేశారు. మొ త్తం 39మంది అభ్యర్థులు బరిలో ఉండటం తో ఎన్నికలు జరుగుతాయని అందరూ భా వించారు. ఇదిలాఉండగా, లోపాయికారి ఒప్పందంతో ఏకగ్రీవానికి సరిపడా 10 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
 
 39 మంది నామినేషన్లు
 21 స్థానాలకు 39మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలుచేశారు. అయితే నామినేషన్ల పరిశీలనలో ఎనిమంది మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వీరిలో నలుగురు అభ్యర్థులు రిజర్వేషన్లలో కాకుండా, జనరల్ స్థానాల్లో నామినేషన్లు దాఖలుచేసి డిక్లరేషన్‌పత్రంలో మాత్రం బీసీ కులమని పేర్కొన్నారు. మరో నలుగురు అభ్యర్థులు రిజర్వేషన్ల కింద కులం సర్టిఫికేట్లు దాఖలు చేయని కారణంగా ఎనిమిది మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యా యి.
 
  బాలకిష్టన్న(ఆత్మకూర్ జెడ్పీటీసీ), భాస్కర్(మల్దకల్), కవితమ్మ(ధన్వాడ), శకావత్ భీముడు(వంగూర్), హన్మంత్(కొల్లాపూర్), ఖగ్‌నాథ్‌రెడ్డి(ఇటిక్యాల), చంద్రావతి(అయిజ), నవీన్‌కుమార్‌రెడ్డి(కొత్తూ రు), రాజేశ్వర్‌రెడ్డి(గోపాల్‌పేట్), హైమావతి(మిడ్జిల్) తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఎంపికైన అభ్యర్థులకు బుధవారం కలెక్టర్ జీడీ ప్రియదర్శిని నియామక ఉత్తర్వులు అందజేయనున్నారు.
 
 అభివృద్ధి పనులపై డీపీసీ ముద్ర
 గ్రామ, మండల, జిల్లాస్థాయిలో రూపొందించిన అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించి జిల్లా ప్రణాళిక మండలి(డీపీసీ) ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. క్షేత్ర స్థాయిలో జరిగే అభివృద్ధి పనులపైనా సమీక్షించే అధికారం డీపీసీకి  ఉంటుంది. జిల్లా ప్రణాళిక మండలిలో మొత్తం 30 స్థానాలు ఉండగా, జెడ్పీచైర్మన్ అధ్యక్షులుగా, కలెక్టర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఒక మైనార్టీతో పాటు మరో ముగ్గురు నిష్ణాతులను ప్రభుత్వం డీపీసీ సభ్యులుగా నామినేట్ చేస్తుంది.
 

మరిన్ని వార్తలు