నేటి నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్‌ కౌన్సెలింగ్‌ 

7 Jul, 2018 01:14 IST|Sakshi

     10 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం.. నోటిఫికేషన్‌ జారీ 

     10,847 మందితో తుది జాబితా విడుదల 

     కాలేజీలో చేరకపోతే వచ్చే కౌన్సెలింగ్‌కు అనర్హులు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో 2018–19 సంవత్సరానికి ‘ఎ’కేటగిరీ కన్వీనర్‌ కోటా సీట్లకు తొలి విడత వెబ్‌ కౌన్సెలింగ్‌కు శుక్రవారం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ మేరకు వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి ఓ ప్రకటన జారీచేశారు. కన్వీనర్‌ కోటా సీట్లకు ఇప్పటికే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిందని, తుది మెరిట్‌ జాబితా విడుదల చేసినట్లు తెలిపారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మొదటి ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు అభ్యర్థులు ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు కూడా తొలి విడత కౌన్సెలింగ్‌లోనే ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రాధాన్య క్రమంలో అభ్యర్థులు ఎన్ని వెబ్‌ ఆప్షన్లు అయినా ఇచ్చుకోవచ్చని చెప్పారు.  

వచ్చిన కాలేజీలో చేరాల్సిందే..! 
సీటు కేటాయించాక సంబంధిత అభ్యర్థికి కేటాయించిన కాలేజీలో చేరకపోతే వచ్చే కౌన్సెలింగ్‌కు అనర్హులుగా ప్రకటిస్తామని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు అభ్యర్థులు వారి ప్రాధాన్యం, కాలేజీ, కోర్సుల ఎంపికలో జాగ్రత్త వహించాలని సూచించారు. క్రీడలు, ఎన్‌సీసీ, క్యాప్‌ కేటగిరీ అభ్యర్థులకు సంబంధిత అధికారుల నుంచి ప్రాధాన్య జాబితా వచ్చాక ఆయా కోటాకు సంబంధించిన వెబ్‌ అప్షన్లకు మరో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని చెప్పారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ www. knruhs. inను సందర్శించాలని సూచించారు. నీట్‌లో 1 నుంచి 5 వేల ర్యాంకుల అభ్యర్థులు 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 8వ తేదీ రాత్రి 11 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలన్నారు. 5,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు విద్యార్థులు 8వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. వెబ్‌ ఆప్షన్లను మార్చుకోవాలనుకునే వారికి 10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అవకాశం ఇస్తామని చెప్పారు. వెబ్‌ ఆప్షన్లకు సంబంధించిన పేజీని ప్రింటు తీసుకోవాలని పేర్కొన్నారు. సీటు కేటాయించిన తర్వాత విద్యార్థుల మొబైల్‌ ఫోన్లకు సమాచారం అందజేస్తామన్నారు. సీటు కేటాయింపు తర్వాత సంబంధిత లెటర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు.  

మొదటి జాబితా విడుదల.. 
సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం మొదటి విడతకు సంబంధించిన తుది జాబితాను కాళోజీ ఆరోగ్య వర్సిటీ విడుదల చేసింది. మొత్తం 10,847 మందితో జాబితాను విడుదల చేశారు. అందులో నీట్‌లో 16వ ర్యాంకు సాధించిన మెండ జైదీప్‌ నుంచి 7,56,526 ర్యాంకున్న విద్యార్థికి కూడా జాబితాలో పేరు దక్కింది.  

మరిన్ని వార్తలు