బతుకుదెరువు కోసం వెళ్లి సౌదీలో మృతి

15 Jul, 2015 19:56 IST|Sakshi

మెదక్(దుబ్బాక): చేసిన అప్పులు తీర్చేందుకు సౌదీ వెళ్లిన ఓ వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు రావటంతో ప్రాణాలొదిలాడు. మెదక్ జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామానికి చెందిన చుక్క రాములు(55) తనకున్న నాలుగున్నర ఎకరాల్లో బోరు కోసం రూ.లక్ష అప్పు చేశాడు. బోర్లు వేసినా వాటిలో చుక్క నీరు పడలేదు. ఇక వ్యవసాయంతో లాభం లేదని భావించిన రాములు... ఉన్న ఊరు, కుటుంబాన్ని వదిలేసి మూడు రోజుల కిందట సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఆ ఖర్చుల కోసం మరో రెండు లక్షల రూపాయలు అప్పు చేశాడు.

సౌదీలో పనిచేసి ఈ అప్పులన్నింటినీ తీర్చేద్దామనుకున్న రాములు... అక్కడే గుండెపోటుతో మృతిచెందాడు. మంగళవారం రాత్రి గుండె నొప్పితో బాధపడుతున్న రాములుని అతని మిత్రులు ఆసుపత్రికి తరలించేలోపు ప్రాణాలు వదిలాడు. కుటుంబసభ్యుల రోదనలతో ఆకారం గ్రామంలో విషాదం నిండుకుంది. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని వెంటనే తమకు అందించేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు