కీసర: ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎంవీ.రెడ్డి బూత్ స్థాయి సిబ్బందికి సూచించారు. మంగళవారం కీసర ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల నిర్వాహణకు సంబంధించిన విధులపై ప్రతి ఉద్యోగి అవగాహన కల్గి ఉండాలన్నారు. ఎటువంటి లోపాలు లేకుండా విధులను నిర్వహించాలని సూచించారు. ఎన్నికల విధులపై వారికి ఎంత మేరకు అవగాహన ఉందన్న విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు. కీసర ఆర్డీఓ, రిటర్నింగ్ అధికారి లచ్చిరెడ్డి, ఆరు మండలాలకు చెందిన బూత్ స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.