హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ నీడలో కరోనా యోధులు!

13 May, 2020 02:47 IST|Sakshi

74 లక్షల మాత్రలను పంపిణీ చేసిన వైద్య, ఆరోగ్యశాఖ

కరోనా కట్టడిలో ఉన్న 2.74 లక్షల మందికి అందజేత

అందులో 50 వేల మంది నర్సులు, డాక్టర్లు, సిబ్బంది

పోలీసులు, ఇతర శాఖల వారికి కూడా పంపిణీ

ఈ మాత్రల వల్లే వీరిని కాపాడుకోగలిగామన్న భావన 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నియంత్రణలో పాలుపంచుకుంటున్న వారందరికీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హై డ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను సరఫరా చేసింది. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు, వైరస్‌ను అడ్డుకుంటుం ది. ఆ ప్రకారం రాష్ట్రంలో వైరస్‌ నియంత్రణ కోసం పనిచేస్తున్న కరోనా యోధులైన ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, డాక్టర్లు, నర్సులు ఇతర వైద్య సిబ్బందికి అందజేశారు. అలాగే పోలీసులు, పురపాలక సిబ్బంది, ఇతర శాఖలకు చెందిన కరోనా విధుల్లో ఉన్న వారికి కూడా ఇచ్చారు. నిర్ణీ త డోసుల్లో విడతల వారీగా ఈ మాత్రలు వేసుకున్నప్పటి నుంచి 3 నెలల వరకు దీని ప్రభావం ఉంటుందని, వైరస్‌ను దరిచేరనివ్వదని, సిబ్బందిని కాపాడుతుందని వైద్యాధికారులు అంటున్నారు. 

49,503 మంది వైద్య సిబ్బంది: వైద్య ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం అన్ని జిల్లాల్లో వైద్య సిబ్బంది మొత్తం కలిపి 49,503 మంది కరోనా నియంత్రణలో పాలుపంచుకుం టున్నారు. వారిలో ఆశ కార్యకర్తలు 27,045 మందికి, ఏఎ న్‌ఎంలు 8,647 మందికి, ఆరోగ్య కార్యకర్తలు, సూపర్‌ వైజర్‌ కేటగిరీలోని 2,026 మందికి, స్టాఫ్‌ నర్సులు 2,140 మందికి, ల్యాబ్‌ టెక్నీషియన్లు 887 మందికి, మరో 887 ఫార్మాసిస్టులకు, ఇతరత్రా సహాయక సిబ్బంది 1,174 మందికి, మెడికల్‌ ఆఫీసర్లు 1,097 మందికి ఈ మాత్రలను అన్ని జిల్లాల్లో అందజేశారు. వీరుగాక ఇతర శాఖలకు (లైన్‌ డిపార్ట్‌మెంట్‌ స్టాఫ్‌) చెందిన కరోనా నియంత్రణలో పాల్గొంటున్న 2,24,500 మంది సిబ్బందికి కూడా అందజేశారు. అలాగే రాష్ట్రస్థాయిలో 34 వివిధ శాఖల కార్యాలయాలకు చెందిన 20 వేల మంది సిబ్బంది కూడా ఉన్నారు. వీరందరికీ కలిపి వివిధ డోసులకు చెందిన 73,98,072 హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను ఇప్పటివరకు సరఫరా చేశారు. ఈ మాత్రలు 400 ఎంజీ, 200 ఎంజీ డోసుల్లో ఉంటాయి. వాటిలో ఎక్కువగా 200 ఎంజీ మాత్రలను అందజేశారు. ఈ మాత్రలను రాష్ట్రస్థాయిలో ఉన్నత స్థానాల్లో ఉన్న వివిధ శాఖల కీలకాధికారులు కూడా వాడినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. వైద్య ఆరోగ్యశాఖలోని అధికారులు, వైద్యులు కూడా వీటిని వాడారని అధికారులు వెల్లడించారు.

కరోనా కాంటాక్టులకు వాడకం: ఇక హైడ్రాక్సిక్లోరోక్విన్‌ మాత్రలను పాజిటివ్‌ వచ్చిన రోగులకు, వారి కాంటాక్టులకు, వారి కుటుంబాల్లోని వ్యక్తులకు కూడా వాడారు. 60 వేల మందికి ఈ మాత్రలు ఇచ్చినట్లు చెబుతున్నారు.

సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవు..: ఈ మాత్రలు వాడితే సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉం డవని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను కొన్ని జబ్బుల్లో నిత్యం వాడేవారు కూడా ఉన్నారు. వారికి ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ రాలేదు. మేమంతా వాడుతున్నాం. మాకేమీ కాలేదు. సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయన్నది తప్పు’అని ఆయన అన్నారు. వాస్తవంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కాంటాక్టుల నుంచి సామూహిక వ్యాప్తి జరగకపోవడానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ చాలావరకు ఉపయోగపడిందని ఆయన పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన వారు వాడితే మంచిదేనని, ఈ మాత్రలకు ఇప్పటికీ కొరత లేదని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు