టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’

27 Sep, 2017 02:46 IST|Sakshi

ముఖ్యఅతిథులుగా పాల్గొన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

సాక్షి, హైదరాబాద్‌: బ్రిటన్‌లో నివసిస్తున్న కేసీఆర్, టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు (కేటీఎస్‌యూకే) సోమవారం లండన్‌లో ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’పేరిట కార్యక్రమం నిర్వహించారు. కేటీఎస్‌యూకే నేత నగేశ్‌రెడ్డి కాసర్ల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో.. సంస్థ సభ్యులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, తెలంగాణవాదులతో పాటు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళి, ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌ గౌడ్, తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవీప్రసాద్‌ తదితరులు అందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తాము చేపట్టిన కార్యక్రమాల గురించి నగేశ్‌రెడ్డి వివరించారు. ‘చేనేతకు చేయూతనిద్దాం నేతన్నకు మద్దతునిద్దాం..’ అనే నినాదంతో తాము కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. వివిధ దేశాల్లో టీఆర్‌ఎస్‌ ఎన్నారై కార్యక్రమాలకు సీఎం కేసీఆర్, ఇతర నేతలు ప్రోత్సాహం ఇస్తున్నారని సంస్థ అధ్యక్షుడు సిక్కా చంద్రశేఖర్‌గౌడ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా చేనేతను ప్రోత్సహించేందుకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నారైల అండదండలు ఉండాలని దేవీప్రసాద్‌ కోరారు. కేసీఆర్‌ చేనేత పరిశ్రమ కోసం వినూత్న పథకాలతో కృషి చేస్తున్నారన్నారు.

ఇక హైదరాబాద్‌ను అంతర్జా తీయస్థాయి నగరంగా తీర్చిదిద్దేలా కృషి జరుగుతోందని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ తెలిపారు. ఎక్కడా లేనివిధంగా టీఎస్‌ ఐ–పాస్‌ ద్వారా పరిశ్రమల స్థాపనకు కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ కొండా మురళి పేర్కొన్నారు. తాను ఒక చేనేత కుటుంబం నుంచి వచ్చానని, చేనేత అభివృద్ధికి తోడ్పడతానని ఎమ్మెల్యే కొండా సురేఖ చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం అధ్యక్షుడు రామ్‌ చెప్యాల, శ్రీనివాస్‌రెడ్డి పింగళి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు