250 కోట్లతో మెగా డెయిరీ

10 Jul, 2020 03:44 IST|Sakshi

రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో శ్రావణ మాసంలో శంకుస్థాపన 

కృత్రిమ గర్భధారణపై పాడి రైతులకు అవగాహన కల్పిస్తాం

55 ఎకరాల్లో శిక్షణ కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం: మంత్రి తలసాని  

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో 250 కోట్ల రూపాయల వ్యయంతో మెగా డెయిరీని నిర్మించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్థ్ధక, మత్స్య, పాడి పరిశ్రమల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. గురువారం మాసబ్‌ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో పశుసం వర్థక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖల అధికారు లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహిం చారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, శ్రావణ మాసంలో ఈ మెగా డెయిరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు చర్యలు తీసుకుంటు న్నామని చెప్పారు. 

రూ. 18.50 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో మామిడిపల్లి లోని 55 ఎకరాల విస్తీర్ణంలో నూతన పశు పరిశోధన కేంద్రం, కృత్రిమ గర్భధారణపై రైతులకు ఆధునిక పద్ధతులలో అవగాహన కల్పించేందుకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయా లని నిర్ణయించడం జరిగిందని, దానికి కూడా శ్రావణ మాసంలోనే శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ఈ కేంద్రం గొర్రెలు, పశుసంపద అభివృద్ధికి తోడ్పడుతుందని, పశువుల గర్భధారణ పరీక్షలలో జాతీయ స్థాయిలో మన రాష్ట్రం మొదటి స్థానంలో, కృత్రిమ గర్భధారణలో 3వ స్థానంలో నిలిచామని అన్నారు. కులవృత్తులకు చేయూత ఇవ్వడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పమన్నారు. గడచిన 70 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం కూడా ఈ రంగాలను పట్టించుకోలేదని మంత్రి తెలిపారు. 

అన్ని వసతులతో షీప్‌ మార్కెట్లు
సీఎం ప్రత్యేక చొరవ, ఆదేశాలతో గొర్రెల పెంపకం దారులు, పాడి రైతులు, మత్స్యకారుల అభివృద్ధి కోసం వందల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు తలసాని వివరించారు. ముఖ్యమంత్రి మానసపుత్రిక అయిన గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 80 కోట్ల గొర్రెలను పంపిణీ చేయగా, అవి ఇప్పుడు పిల్లలతో కలుపుకొని 2 కోట్లకు చేరాయని చెప్పారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం దేశంలోనే గొప్ప పథకంగా నిలిచిందని అన్నారు. ఇప్పటికే 50 శాతం మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందని, మిగిలిన లబ్ధిదారులకు కూడా త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్పారు.

జీవాలకు దాణా, మరణించిన జీవాలకు ఇన్‌స్రూ?న్స్‌ వర్తింపచేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తున్నామని, నాణ్యమైన మాంసాన్ని వినియోగదారులకు అందించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాలలో మాంసం దుకాణాలు ఏర్పాటు చేయాలని, మొబైల్‌ దుకాణాల ద్వారా మాంసం అందించాలని నిర్ణయించామన్నారు. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి ఏర్పాటుచేసిన కమిటీ నెల రోజుల్లో నివేదిక ఇస్తుందన్నారు. అన్ని వసతులతో కూడిన షీప్‌ మార్కెట్‌ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇప్పటికే నల్లగొండ, సిద్దిపేట జిల్లాలో మార్కెట్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఖమ్మం, వనపర్తిలో ఒక్కోచోట 5 ఎకరాల విస్తీర్ణంలో షీప్‌ మార్కెట్‌ల నిర్మాణానికి స్థలాన్ని సేకరించడం జరిగిందని, వాటి నిర్మాణానికిగాను ఒక్కో దానికి రూ. 25 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. 

ఈ సంవత్సరం 24 వేల నీటి వనరులలో 80 కోట్ల చేప పిల్లల విడుదలకు నిర్ణయించామని చెప్పారు. ఆక్వా హబ్‌ ఏర్పాటులో భాగంగా మిడ్‌ మానేరు డ్యాం నుండి 10 కిలోమీటర్ల పరిధిలో 62 గ్రామాలలో సర్వే జరిపామని, ఈ సర్వేలో 3,962 మంది మత్స్యకారులు, 259 మంది భూ నిర్వాసితులను గుర్తించినట్లు చెప్పారు. ఇందులో 2,680 మంది మత్స్యకారులు, 42 మంది భూనిర్వాసితులకు చేపలు పట్టుకోవడానికి లైసెన్స్‌లు ఇచ్చినట్లు తెలిపారు. అధికారులు, సిబ్బంది సహకారంతోనే అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు