నిషిత్‌ మృతిపై ‘బెంజ్‌’ రిపోర్ట్‌లో ఏముంటుంది?

18 May, 2017 12:46 IST|Sakshi
నిషిత్‌ మృతిపై ‘బెంజ్‌’ రిపోర్ట్‌లో ఏముంటుంది?

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌ నారాయణ, అతడి స్నేహితుడు అరవింద్‌ ఘోర బెంజ్‌ కారు ప్రమాదానికి గురై చనిపోవడంపట్ల జర్మనీ బెంజ్‌ ప్రతినిధులు రెండు రోజుల్లో నివేదిక ఇవ్వనున్నారు. ఇప్పటికే రెండు రోజులపాటు ప్రమాదం జరిగిన చోటును పరిశీలించినవారు జూబ్లీహిల్స్‌ పోలీసులకు తమ రిపోర్ట్‌ను అందజేయనున్నారు. గత వారం నిషిత్‌ అతడి స్నేహితుడితో కలిసి అర్ధరాత్రి తర్వాత 2.30గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌లో వేగంగా వెళుతూ నేరుగా మెట్రోపిల్లర్‌ 36కు ఢీకొట్టిన ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే.

అయితే, అత్యాధునిక సౌకర్యాలున్న ఆ విలువైన కారులో ప్రయాణించిన వారు చనిపోవడానికి గల సరైన కారణాలు ఏమై ఉంటాయో తెలుసుకునేందుకు జూబ్లీహిల్స్‌ పోలీసులు మెర్సిడస్‌ బెంజ్‌ కార్ల కంపెనీ యాజమాన్యానికి 6 ప్రశ్నలతో కూడిన లేఖను పంపారు. ప్రమాదంలో ఎయిర్‌బెలూన్లు ఏ పరిస్థితుల్లో తెరుచుకుంటాయి? నిశిత్‌ మరణించిన సమయంలో ఎందుకు పగిలిపోయాయి? మెకానికల్‌ డిఫెక్ట్స్‌ ఉన్నాయా..? స్పీడోమీటర్‌ ఎంతవరకు లాక్‌ చేయాలి? ఎంత స్పీడ్‌ ఉంటే ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకుంటాయి? సీటుబెల్టు పెట్టుకుంటే తెరుచుకుంటాయా...? పెట్టుకోకున్నా తెరుచుకుంటాయా..? అన్న విషయాలు తెలపాల్సిందిగా అందులో కోరారు.

దీంతో ఈ విషయంపై ఆరా తీసి పోలీసులకు వివరణ ఇచ్చేందుకు జర్మనీ నుంచి వచ్చిన నలుగురు ప్రతినిధులు ప్రమాద స్థలిని పరిశీలించడంతోపాటు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అలాగే ప్రస్తుతం బోయినపల్లిలోని బెంజ్‌ షోరూంలో ఉన్న కారును పరిశీలించి అసలు డ్రైవింగ్‌ చేసినప్పుడు వారు సీటు బెల్టు పెట్టుకున్నారా? అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. కారు వేగం, సీటు బెల్టు, బెలూన్లు, ఆ సమయంలో ఇంజిన్‌ పరిస్థితివంటి అంశాలపై ప్రధానంగా బెంజ్‌ ప్రతినిధులు నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు