మరోసారి ఆగిన మెట్రో రైలు

19 Jan, 2020 03:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెట్రో రైలు మరోసారి మొరాయించింది. ఎల్‌బీనగర్‌ నుంచి మియాపూర్‌ వెళ్లే మెట్రో రైలు శనివారం మధ్యాహ్నం సాంకేతిక కారణాలతో పంజగుట్ట స్టేషన్‌ వద్ద నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులను స్టేషన్‌లోనే దింపేశారు. ఫెయిల్‌ అయిన రైలును ఎర్రమంజిల్‌–పంజగుట్ట మధ్యలో ఉన్న పాకెట్‌ ట్రాక్‌లోకి మళ్లించి మరమ్మతులు చేపట్టారు.

ఈ క్రమంలో ఎల్‌బీనగర్‌–మియాపూర్‌ మధ్య చాలాసేపు మెట్రో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శనివారం వీకెండ్‌ కావడంతో వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించేందుకు మెట్రో రైళ్లను ఆశ్రయించిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అమీర్‌పేట్‌ స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ పెరగడంతో అమీర్‌పేట్‌ నుంచి మియాపూర్‌ వరకు అదనపు రైళ్లను నడపాల్సి వచ్చింది. మధ్యాహ్నం తరువాత ఎల్‌బీనగర్‌–మియాపూర్‌ మధ్య మెట్రో రాకపోకలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు.

మరిన్ని వార్తలు