నగరంలోని మల్టీప్లెక్స్‌ల్లో తనిఖీలు

2 Aug, 2018 14:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్‌లపై తూనికలు కొలతల శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ శాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయిన కూడా వారు నిబంధనలకు పాటించడంలేదని వార్తలు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్‌ పరిధిలోని ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌, ఉప్పల్‌ ఏషియన్‌, ఏఎస్‌ రావు నగర్‌లోని రాధిక, జీవీకే మాల్‌, కాచిగూడ ఐనాక్స్‌తో పాటు ఇతర మల్టీప్లెక్స్‌ల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందుకోసం ఏడు టీమ్‌లను ఏర్పాటు చేసినట్టు ఆ శాఖ కంట్రోలర్‌ అకూన్‌ సబర్వాల్‌ తెలిపారు. ఇప్పటి వరకు అధికారులు 20 కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది.

కాచిగూడ ఐనాక్స్‌కు నోటీసులు
ఈ రోజు ఉదయం తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ నిర్మల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కాచిగూడలోని ఐనాక్స్‌ ధియేటర్‌లో అధికారులు దాడులు నిర్వహించారు. ప్రమాణాలు పాటించకుండా వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు గుర్తించిన అధికారులు యాజమాన్యానికి నోటీసులు అందజేశారు. ఐనాక్స్‌ నిర్వహకులు నెట్‌ క్వాంటిటి, ఎమ్మార్పీ ధరలు లేకుండా అమ్మకాలు చేపట్టడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.పలు శ్యాంపిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఉప్పల్‌ ఏషియన్‌, కొత్తపేట మహాలక్ష్మీ థియేటర్‌పై  మూడు కేసులు నమోదు చేసినట్టు ఏసీసీ జగన్‌మోహన్‌ తెలిపారు. చాలా వరకు థియేటర్లలో నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నట్టు తేలిందన్నారు. సినిమా హాళ్లు, మల్టీప్లెక్సుల్లో ఉత్పత్తులను అధిక ధరలకు అమ్ముతున్నట్లుగా కొంతకాలంగా ప్రేక్షకుల నుంచి తూనికల శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో థియేటర్లలో అధిక ధరలకు అడ్డుకట్ట వేయడానికి తూనికలు కొలతల శాఖ చర్యలు చేపట్టింది.

మరిన్ని వార్తలు