రూప్‌లీ.. పైదల్‌ చలీ..

27 Apr, 2020 12:42 IST|Sakshi

కామారెడ్డి, భిక్కనూరు: వలస కూలీల జీవితాల్లో కరోనా చీకట్లను నింపింది. చేయడానికి పనిలేక.. ఉండడానికి తావులేక చాలామంది తమ స్వస్థలాలకు తిరుగు ప్రయాణమవుతున్నారు. వాహనాలు లేకపోవడంతో నడుచుకుంటూ కొందరు.. సైకిళ్లపై మరికొందరు వెళ్తున్నారు. అలాంటివారిని కదిలిస్తే కన్నీళ్లు వస్తున్నాయి. వారి కష్టాలను ఏకరువు పెడుతున్నారు.(ఇడిసిపెడితే నడిసి నేను బోత సారూ..!)

‘‘నా పేరు రూప్‌లీ సింగ్‌.. భర్త పేరు ప్రేమ్‌సింగ్‌.. మాకు ఇద్దరు పిల్లలు.. స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌. ఐదేళ్ల క్రితం బతుకుదెరువుకోసం హైదరాబాద్‌కు వచ్చాం. భర్త పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. గతనెల 15న మా చిన్నమామ మరణించడంతో నా భర్త స్వగ్రామానికి వెళ్లాడు. కరోనాతో లాక్‌డౌన్‌ విధించడంతో అక్కడే ఉండిపోయాడు. పనిలేక పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో సొంతూరుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. మా ఊరుకు చెందినవారితో కలిసి వెళ్తున్నా. శుక్రవారం హైదరాబాద్‌నుంచి నడుచుకుంటూ బయలుదేరాం. ఇంకా 1300 కిలోమీటర్లు వెళ్లాలి’’ అని పేర్కొంది.(సొంతూరికి.. కాలినడకన)

సైకిల్‌పై స్వస్థలానికి..
‘‘నా పేరు యామిని. మా స్వస్థలం చత్తీస్‌ఘడ్‌. బెంగళూరులో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాం. కరోనా ప్రభావంతో ఫ్యాక్టరీ మూతపడింది. ఇప్పట్లో ఫ్యాక్టరీ తెరిచే పరిస్థితి లేదని నిర్వాహకులు చెప్పారు. చేయడానికి ఏ పనీ లేదు. చేతిలో పైసలూ లేవు. ఇంటి కిరాయి కూడా కట్టే పరిస్థితి లేదు. తిండికీ ఇబ్బందిగా ఉంది. దీంతో మా ఊరుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. బస్సులు నడుస్తలేవు. అందుకే సైకిళ్లపై వెళ్తున్నాం. ఈనెల 20వ తేదీన బెంగళూరునుంచి బయలుదేరాం. మా ఊరుకు చేరేసరికి ఇంకెన్ని రోజులు పడుతుందో ఏమో’’ అంటూ నిట్టూర్చింది.

మరిన్ని వార్తలు